చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్: ఒక దెబ్బకు రెండు పిట్టలు, ఎలా?
హైదరాబాద్: ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో రెడ్లకు ప్రాధాన్యం లేదనే విమర్శకు సమాధానం చెబుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజ్యసభ సీటు దక్కకుండా చూడాలనే వ్యూహాన్ని ఖరారు చేసి చంద్రబాబు అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉన్న రెడ్డి ట్యాగ్ను దెబ్బ తీయాలనేది కూడా ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉన్న కర్నూలు, కడప జిల్లాలపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు. కాపులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.
Also Read: చంద్రబాబు ప్లాన్: నారా లోకేష్ను పక్కకు తప్పించారా?
కర్నూలు నుంచి భూమా నాగిరెడ్డిని, కడప జిల్లా నుంచి జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆది నారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకుని వారికి మంత్రి పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు రెడ్డు మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. పల్లె రఘునాథ రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నారు.
మరోవైపు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఆరుగురు మంత్రులుగా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి ఆరు మంత్రి పదవులు కల్పించి రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బలహీనపరచాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
అదే సమయంలో రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచడం ద్వారా ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్న ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఊపందుకోకుండా జాగ్రతపడవచ్చునని కూడా ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, జగన్కు 67 మంది శాసనసభ్యులు ఉన్నారు. దీంతో త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓ రాజ్యసభ సీటును గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా దెబ్బ తీసి నాలుగుకు నాలుగు రాజ్యసభ సీట్లను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఒక రాజ్యసభ సభ్యుడి ఎన్నికకు 45 మంది శాసనసభ్యుల బలం అవసరం ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అతలాకుతలం చేయాలనే ఉద్దేశంతోనే ఆపరేషన్ ఆకర్ష్ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లుచెబుతున్నారు.