బీజేపీపై చంద్రబాబు మార్క్ రాజకీయం షురూ..!
అధికారమే పరమావధిగా ఏపీలో రాజకీయ పార్టీలన్నీ పని చేస్తున్నాయి. టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన సంగతి అందరికి తెలిసిందే. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఈ కూటమి పని చేస్తుందని నాయకులు చెబుతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ.. అసలు కూటమిలో పొత్తు ధర్మం నడుస్తుందా అంటే లేదనే సమాధానం వస్తోంది. ఎవరికి నచ్చినట్టు వారు సీట్లను ప్రకటించుకుంటున్నారు. ఒక పార్టీలో టికెట్ దక్కకుంటే.. భాగస్వామ్య పార్టీలో చేరి టిక్కెట్ దక్కించుకుంటున్న పరిస్థితి కూటమిలో కనిపిస్తోంది.
టికెట్ దక్కకుంటే నాయకులు ప్రత్యర్థి పార్టీలోకి వెళ్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా పొత్తులో ఉన్న వేరే పార్టీకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. టీడీపీ నుంచి జనసేనలోకి.. జనసేన నుంచి టీడీపీలోకి.. బీజేపీ నుంచి టీడీపీలోకి.. నేతలు వలస బాట పడుతున్నారు. పార్టీ నాయకత్వాలే నేతలను ప్రత్యేకంగా ఆహ్వానించడం ఇక్కడ మరో విశేషం.పులపర్తి రామాంజనేయులు ఇటీవలే టీడీపీని వీడి జనసేనలో చేరారు. భీమవరం జనసేన టికెట్ ఆయనకే కేటాయించారు.

బీజేపీ నుంచి బైరెడ్డి శబరి టీడీపీలో చేరారు. ఆమె మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె. నిన్నటి వరకు తండ్రితో పాటు బీజేపీలో పని చేశారు. ఇప్పుడు ఆమె టీడీపీలో చేరడంతో ఎంపీ సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సైతం టీడీపీ ఆహ్వానం పలుకుతుంది. ఆయనకు పాణ్యం టికెట్ ఇస్తామని ఆ పార్టీ ఆఫర్ చేస్తోంది. ఈ తతంగాన్ని అంతా ఒక్కసారి గమనిస్తే..అసలు మూడు పార్టీలు పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నాయా అనే అనుమానం కలుగుతుంది.

దీని వల్ల టీడీపీకే లాభం ఎక్కువ చేకూరుతుంది. తమ పార్టీ నాయకులను వేరే పార్టీలకు పంపిస్తూ.. వారికే టికెట్లు వచ్చేలా టీడీపీ అధినేత ప్రణాళికలు రచిస్తున్నారు.ఇదే సమయంలో బీజేపీలో ఉన్న ప్రో టీడీపీ నేతలు టికెట్లు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. మరోవైపు బీజేపీ నుంచి నాయకులు టీడీపీలో చేరుతుండడాన్ని కాషాయ దళం సహించలేకపోతోంది. ఇది టీడీపీ వెన్నుపోటు రాజకీయమని నిజమైన బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై బీజేపీ అధినాయకత్వం ఎంత త్వరగా మెలుకుంటే అంత మంచిదనే అభిప్రాయం బీజేపీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతుంది












Click it and Unblock the Notifications