ఎన్టీఆర్ క్యాంటిన్లు, రూ. ఐదుకే భోజనం: చంద్రబాబు
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నానుయుడు బుధవారం శ్రీకాకుళంలో జరిగిన ప్రజాగర్జన సభలో వరాల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరు మీద క్యాంటీన్లు ఏర్పాటు చేసి, వాటిలో పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆడపిల్లలకు సెల్ఫోన్ల వంటి హామీలు ఇచ్చారు. పసుపు దళాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనతో తెలుగుజాతికి తీవ్ర అన్యాయం జరిగిందని, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరితే ఢిల్లీ పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు జాతిని కాపాడుకోవడం తన ముందున్న కర్తవ్యమని, తెలంగాణ పునర్నిర్మాణం, సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చే బాధ్యత తన భుజాలపై ఉందని ఆయన ప్రకటించారు. ఓటుతో మరింత బలమిస్తే ఢిల్లీ పెద్దల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని, ఆంధ్రా జోలికి రావడానికే భయపడేలా చేస్తానని గర్జించారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలపై ఆయన ధ్వజమెత్తారు.
కాంగ్రెస్, బిజెపి రెండూ తెలంగాణకు అనుకూలమని చెప్పిన తరువాత చేసేదేమీ లేక సమన్యాయం చేయాలని తాను కోరినా సంఖ్యాబలం లేక విఫలమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తానిచ్చిన లేఖతోనే రాష్ట్ర విభజన జరిగిందని కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే రెండు ప్రాంతాల వారికీ న్యాయం చేయమన్నదే ఆ లేఖ సారాంశమని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాను పెట్టిన రాజకీయ భిక్షతో ఎన్నో పదవులు వెలగబెట్టిన కెసిఆర్ వసూల్ రాజా అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. అన్నారు. సైకో నాయకుడని దుయ్యబట్టారు. తెలుగుజాతి ఐకమత్యాన్ని, అభివృద్ధిని చూసి ఓర్వలేని కేరళ, కర్ణాటక, చెన్నై రాష్ట్రాలకు చెందిన కొందరు కేంద్రమంత్రులు చిచ్చుపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణలో తాను విడిచిపెట్టిన బిసి రామబాణం దూసుకుపోతోందన్నారు. అక్కడ బీసీని ముఖ్యమంత్రిని చేసి ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. సీమాంధ్రలో కాంగ్రెస్ దివాలా తీసిందని చెప్పారు. రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లోని ప్రజలు టిడిపి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.