ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!
ఏపీలో దీపం (deepam) పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలెండర్లు (LPG) తీసుకుంటున్న లబ్దిదారులకు ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. దీపం పథకం కింద రాయితీ పొందుతున్న వీరికి భవిష్యత్తులో పైప్డ్ గ్యాస్ (PNG) కు మార్చేందుకు వీలుగా సీఎం చంద్రబాబు (chandrababu) కీలక ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇలా మారేందుకు వారు వ్యక్తం చేస్తున్న అభ్యంతరంపై సమీక్షించిన సీఎం.. ఆ విషయంలోనూ క్లారిటీ ఇచ్చేశారు.
ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్దతతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఇవాళ అధికారులకు, ఆయిల్ కంపెనీలకు సూచించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే దీపం పథకం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. దీపం పథకం లబ్దిదారులు పీఎన్జీకి మారితే... వారికి దీపం పథకం కింద ఇచ్చే రాయితీ సొమ్మును జమ చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీనిపై వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని ఆదేశించారు

పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నా దీపం పథకం ద్వారా కలిగే లబ్ది పొందవచ్చన్న విషయంపై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సరఫరా ఇబ్బందులను అధిగమించడానికి ఆయిల్ కంపెనీలు పీఎన్జీ కనెక్షన్లను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. వచ్చే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని... ఈ విషయంలో జాప్యం ఉండకూడదని, టార్గెట్ ఎట్టిపరిస్థితుల్లో చేరుకోవాలని చెప్పారు. అలాగే శ్రీకాకుళం - కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై వివరణ కోరిన సీఎం..దీనికి సంబంధించి పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరీకి ఫోన్ చేసి పనుల పూర్తికి హామీ తీసుకున్నారు.












Click it and Unblock the Notifications