ఇంత అధ్వానమా.. ఛైర్మన్ను ప్రభావితం చేశారు : సెలెక్ట్ కమిటీ నిర్ణయంపై బుగ్గన
వికేంద్రీకరణ బిల్లు,సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు మండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకోవడంతో వైసీపీకి షాక్ తగిలినట్టయింది. ఛైర్మన్ నిర్ణయంతో దాదాపు మూడు నెలల పాటు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఛైర్మన్ నిర్ణయం నిబంధనలకు విరుద్దం అని వైసీపీ ఆరోపిస్తుండగా.. తాము ముందుగానే నోటీసులు ఇచ్చామని టీడీపీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండలి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే..
ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయన్నారు బుగ్గన. రాష్ట్ర చరిత్రలో ఇదో దుర్దినం అని,బ్లాక్ డే అని అన్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యం,చట్టసభలపై టీడీపీకి ఏమాత్రం గౌరవం లేనందువల్లే ఇలా చేసిందన్నారు.

చంద్రబాబు ఒత్తిడి వల్లే..
మండలిలో బిల్లులపై చర్చ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని ఛైర్మన్ను ప్రభావితం చేశారని ఆరోపించారు. సెలెక్ట్ కమిటీకి పంపించేలా చైర్మన్పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు సీఎం జగన్ తాపత్రయపడుతున్నారని చెప్పారు. అందుకే 13 జిల్లాలను జోన్ల వారీగా అభివృద్ది చేసేందుకు బిల్లు తీసుకొచ్చామని చెప్పారు.

నిబంధనలకు వ్యతిరేకంగా..
ఎంతో మేధోమథనం,ఎన్నో కమిటీల అధ్యయనం తర్వాత అన్ని ప్రాంతాలను సమ అభివృద్ది చేసేందుకు వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. అసెంబ్లీ నుంచి మండలి ఆమోదం కోసం పంపితే తొలి నుంచి టీడీపీ నేతలు అడ్డు తగిలారని అన్నారు. స్పీకర్గా,మంత్రిగా పనిచేసిన యనమల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని మండిపడ్డారు. బిల్లులను పాస్ చేయడమో,తిరస్కరించడమో చేయకుండా సెలెక్ట్ కమిటీకి పంపించారని అన్నారు.

నచ్చకపోతే రిజెక్ట్ చేయాలి గానీ..
బిల్లులను తిరిగి అసెంబ్లీకి పంపించకూడదనే దురుద్దేశంతోనే టీడీపీ ఇలా వ్యవహరించిందని బుగ్గన అన్నారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించారని అన్నారు. ఇంతటి అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో మునుపెన్నడూ లేదన్నారు. బిల్లుపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలి తప్ప.. పెండింగ్లో పెట్టడం అన్యాయమని అన్నారు.












Click it and Unblock the Notifications