తాతలు దాచిన డబ్బులపై మనవళ్లు, మనవరాళ్లకు హక్కు ఉందా?
దివంగత తాత లేదా అమ్మమ్మలు దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ల (FDలు) డబ్బును తిరిగి పొందడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా వారు ఎలాంటి వీలునామా (Will) రాయకుండా చనిపోయినప్పుడు, ఆ డబ్బు ఎవరికి చెందుతుందనే దానిపై కుటుంబ సభ్యులలో గందరగోళం నెలకొంటుంది. చట్టాలు సంక్లిష్టంగా అనిపించినప్పటికీ, సరైన అవగాహన, పక్కా పత్రాలతో పద్ధతి ప్రకారం వ్యవహరిస్తే ఈ ప్రక్రియను చాలా సులభంగా ముగించవచ్చు.
చాలా మంది భారతీయ కుటుంబాలలో ఎఫ్డీలను సురక్షితమైన పొదుపు మార్గంగా భావించి, ఏళ్ల తరబడి వాటిని బ్యాంకుల్లోనే ఉంచుతుంటారు. అయితే, పెద్దలు కన్నుమూసినప్పుడు ఆ ఎఫ్డీల గురించి వారసులకు సరిగ్గా తెలియకపోవచ్చు. ఒకవేళ మనవళ్లు లేదా మనవరాళ్లు ఆ డబ్బుపై హక్కుల కోసం ప్రయత్నిస్తే, సంబంధిత వారసత్వ చట్టాల (హిందూ వారసత్వ చట్టం, 1956 లేదా భారతీయ వారసత్వ చట్టం, 1925) ప్రకారం నిర్ణయాలు ఉంటాయి.

"హిందూ వారసత్వ చట్టం కింద క్లాస్-1 చట్టబద్ధమైన వారసులందరికీ ఆస్తిపై సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ తాత లేదా అమ్మమ్మ బతికుండగానే వారి కుమారులు లేదా కుమార్తెలు (అంటే మనవళ్ల తల్లిదండ్రులు) మరణించి ఉంటే, అప్పుడు ఆ మనవళ్లు, మనవరాళ్లను కూడా క్లాస్-1 వారసులుగానే పరిగణిస్తారు. వీరికి మరణించిన పెద్దల ఇతర పిల్లలతో సమానంగా, ఏకకాలంలో ఎఫ్డీ డబ్బుపై పూర్తి హక్కులు లభిస్తాయి". అయితే, ఒకవేళ తల్లిదండ్రులు బతికే ఉంటే, మనవళ్లు నేరుగా చట్టబద్ధమైన వారసులు కాలేరు.
నామినీ అంటే యజమాని కాదు.. కేవలం ట్రస్టీ మాత్రమే!
చాలా మంది ఎఫ్డీ అకౌంట్లో నామినీ పేరు ఉంటే, ఖాతాదారుడు మరణించిన తర్వాత ఆ డబ్బు అంతా నామినీదే అని పొరబడుతుంటారు. కానీ చట్టం ప్రకారం నామినీ ఆ డబ్బుకు యజమాని కాడు. నామినీ కేవలం ఒక 'ట్రస్టీ' లేదా సంరక్షకుడు మాత్రమే.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949లోని సెక్షన్ 45ZA ప్రకారం, ఖాతాదారుడు మరణించిన తర్వాత బ్యాంకు నుంచి ఆ డబ్బును విత్డ్రా చేసుకునే ప్రత్యేక హక్కు నామినీకి ఉంటుంది. కానీ, ఆ డబ్బును నామినీ సొంతానికి వాడుకోకూడదు. సంబంధిత వారసత్వ చట్టాల ప్రకారం మరణించిన వ్యక్తి యొక్క అసలైన చట్టబద్ధమైన వారసులకు ఆ డబ్బును భద్రంగా అందజేయాల్సిన బాధ్యత నామినీపై ఉంటుంది. ఇందుకోసం నామినీ బ్యాంకుకు తన కేవైసీ (KYC) పత్రాలతో పాటు, మరణ ధృవీకరణ పత్రం (Death Certificate), ఇండెంనిటీ బాండ్, ఆ డబ్బును వారసులకు అందజేస్తానని హామీ ఇచ్చే అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుంది.
ఒకవేళ నామినీ లేకపోతే ఏం చేయాలి?
ఎఫ్డీ ఖాతాకు నామినీని నియమించకపోయినా, లేదా నామినీ అంతకు ముందే మరణించినా ఆ డబ్బు ఎక్కడికీ పోదు. చట్టబద్ధమైన వారసులు నేరుగా బ్యాంకును సంప్రదించి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ కోసం వారసులు బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దాంతో పాటు:
- డిపాజిటర్ మరణ ధృవీకరణ పత్రం (Death Certificate)
- వారసత్వ ధృవీకరణ పత్రం (Succession / Legal Heirship Certificate)
- ఇండెంనిటీ బాండ్ - అఫిడవిట్
- వారసులందరి కేవైసీ (KYC) పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
వివాదాలు లేకున్నా ఆలస్యం ఎందుకు అవుతుంది?
బ్యాంకులు ఎప్పుడూ నిబంధనలు, సరైన పత్రాల ఆధారంగానే పనిచేస్తాయి తప్ప భావోద్వేగాలతో కాదని గుర్తుంచుకోవాలి. ఎఫ్డీ డబ్బులు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుందంటే, దానికి వారసుల మధ్య వివాదాల కంటే కూడా పత్రాల కొరతే ముఖ్య కారణం అవుతుంది.
లక్షలాది రూపాయల పొదుపు మొత్తాన్ని తదుపరి తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించాలంటే ప్రాథమిక 'ఎస్టేట్ ప్లానింగ్' ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. బతికున్నప్పుడే ఒక సాధారణ వీలునామా (Will) రాసి ఉంచడం, నామినేషన్ వివరాలను పారదర్శకంగా రికార్డు చేయడం ద్వారా తర్వాతి తరం వారికి మానసిక ఒత్తిడి, కోర్టుల చుట్టూ తిరిగే ఖర్చు, గందరగోళాన్ని పూర్తిగా నివారించవచ్చు.














Click it and Unblock the Notifications