AP Fee Reimbursement: ఫీజు రీయింబర్స్ మెంట్ కు 6 వేల కోట్లు ఇవ్వలేరా ?
ఏపీలో విద్యార్ధులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయిలు కొండలా పెరిగిపోతున్నాయి. అయినా ప్రభుత్వం వాటిని క్లియర్ చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో విద్యార్ధులు కాలేజీల నుంచి సర్టిఫికెట్లు కూడా తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. అమరావతికి లక్ష కోట్లు ఖర్చు చేస్తూ ఫీజు రీయింబర్స్ మెంట్ కు 6 వేల కోట్లు ఇవ్వలేరా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
కూటమి పాలనలో చదువులు చతికిల, బిడ్డల జీవితాలు త్రిశంకు స్వర్గం, ఉన్నత విద్యకు చంద్రబాబు గారు దగ్గరుండి పెడుతున్నది ఉరితాడు అంటూ షర్మిల ట్వీట్ చేశారు. వైఎస్సార్ తెచ్చిన ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం కూటమి ప్రభుత్వం చేస్తున్న మహా కుట్ర అన్నారు. రెండేళ్లుగా రూపాయి ఇవ్వకుండా లక్షలాది మంది బిడ్డల భవిష్యత్ ప్రశ్నార్థకంలో నెట్టడమా విధ్వంసం నుంచి వికాసమంటే ? అత్యధికంగా 6 వేలు కోట్లు బకాయిలు పెట్టడమా స్వర్ణాంధ్ర సాధనంటే ? అని ప్రశ్నించారు.

తల్లిదండ్రులను దిక్కుతోచని స్థితిలో పడేయడమా కూటమి ప్రభుత్వ విలువల విద్యా విధానం ? పేద బిడ్డలను ఉన్నత చదువులకు దూరం చేయడమా ప్రభుత్వ రీ- ఓరియంటేషన్ ? అని వరుసగా ప్రశ్నలు సంధించారు. సర్టిఫికెట్లు ఆపుకొని కాలేజీలు ఇబ్బంది పెట్టడమా చదువుల్లో ఏపీ నంబర్ 1 అంటే ? అని అడిగారు. అమరావతి లక్ష కోట్లకు ఢోకా ఉండదు కానీ, విద్యార్థుల చదువులకు ఇచ్చే 6 వేల కోట్లకు లోటు ఉండటం సిగ్గుచేటు అన్నారు.రీయింబర్స్ పథకానికి సుమారు 6 వేల కోట్లు బకాయిలు పెట్టడం సరికాదని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ఇది ప్రభుత్వానికి ఎంత మాత్రం న్యాయం అనిపించుకోదన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతుంటే చోద్యం చూడటం ముఖ్యమంత్రికి తగదన్నారు.














Click it and Unblock the Notifications