జీవో నంబర్ 1 : సుప్రీం ఆదేశాలపై చంద్రబాబు రియాక్షన్ ఇదే !
ఏపీలో వివాదాస్పద జీవో నంబర్ 1పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతే కాదు ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని పట్టుబట్టింది. అయితే నిన్న ఈ పిటిషన్ పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైనా సాధ్యం కాలేదు. దీంతో ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు ఇచ్చింది.
జీవో నంబర్ 1పై ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇవాళ సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను పక్కనబెడుతూ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం తిరిగి ఏపీ హైకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో విపక్ష నేత చంద్రబాబు దీనిపై స్పందించారు. ప్రభుత్వ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో జీఓ నెంబర్ 1 అంశంపై సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని చంద్రబాబు తెలిపారు.
అలాగే జీ.వో.నెం.1 పై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు చెప్పడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే...సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని వైసీపీ సర్కార్ ను ఆయన ప్రశ్నించారు. సైకో తరహా నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ప్రజల ధనాన్ని వృధా చేస్తోందన్నారు. జీ.వో.1ను ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. చంద్రబాబు పర్యటనల్లో జరిగిన తొక్కిసలాటల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ జీవో నంబర్ 1ను తీసుకొచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దానిపై విచారణకు మొగ్గు చూపకపోవడంతో చంద్రబాబు స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
జీ.వో.నెం.1 పై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు చెప్పడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు. జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే... సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సైకో తరహా నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ప్రజల ధనాన్ని వృధా చేస్తోంది. జీ.వో. 1ను వెనక్కి తీసుకోవాలి. pic.twitter.com/U0inkf2kkr
— N Chandrababu Naidu (@ncbn) January 20, 2023