ఏపీ బడ్జెట్లో అప్పులే.. ఆదాయమేది?: మోడీతో విభేదాలు లేవంటూ చంద్రబాబు
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, వైసీపీ సర్కారు విధానాలు, ప్రధానితో విభేదాలు లాంటి అంశాలపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఏపీ సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందన్నారు.

అప్పులు చూపారు.. ఆదాయం ఏది?
మూల ధన వ్యయం సగం కూడా ఖర్చు చేయలేదని చంద్రబాబు విమర్శించారు. అరకొర బడ్జెట్తో జలవనరుల ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులు మాత్రమే చూపుతున్నారనీ.. ఆదాయం పెంచుకునే మార్గాలు ఎక్కడా బడ్జెట్లో చూపలేదని వ్యాఖ్యానించారు. మంగళవారం ఏపీ అసెంబ్లీ, శాసనమండలిలో వైసీపీ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాజధానుల బిల్లులతోపాటు పలు కీలక బిల్లులకు కూడా ఆమోదం తెలిపారు.

వ్యవస్థలను నాశనం చేస్తున్నారు..
ఏడాదిలో విధ్వంసానికి నాంది పలికారు తప్ప, ఏం అభివృద్ధి చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులతో ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఆనాడు దేవుడు స్క్రిప్ట్ రాశాడని ఎమ్మెల్యేల వలసలపై చెప్పిన మాటలేంటి? ఇప్పుడు కూడా దేవుడు స్క్రిప్ట్ రాస్తున్నాడన్నది గుర్తు పెట్టుకోండని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న మూడు రాజధానుల అంశంపై సభలో బిల్లులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

మోడీతో విభేదాలు లేవు..
ప్రధాని నరేంద్ర మోడీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు పోరాడినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా, ఇతర హామీలపై నాడు జగన్ చెప్పిందేమిటి? నేడు చేసేదేంటి? అని చంద్రబాబు నిలదీశారు.

అచ్చెన్న పట్ల అమానుషం.. లొంగకపోవడంతోనే అక్రమ కేసులు
తమ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని పార్టీలోకి రావాలని ప్రలోభాలు పెట్టి బెదిరించారనీ.. ఆయన లొంగకపోవడంతో అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ఆపరేషన్ జరిగిందని చెప్పినా అచ్చెన్న పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగం చేసిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.












Click it and Unblock the Notifications