రాసేవాడికి బుద్ధుందా, లోకేష్కు ముడిపెడితే ఎలా: జగన్ సాక్షిపై బాబు ధ్వజం
విజయవాడ: అమరావతి భూముల కుంభకోణం ఆరోపణలపై వరుస కథనాలు ప్రచురించిన సాక్షి మీడియాపై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో ఎవరైనా డబ్బులు పెట్టి భూములు కొంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.
నిబంధనల ప్రకారం వ్యవహరించారా, లేదా అన్నదే ముఖ్యమని తెలిపారు. గురువారం రాత్రి ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. భూకుంభకోణం జరిగిందని కథనాలు ప్రచురిస్తున్న జగన్ పత్రికపైనా, సీబీఐ విచారణ జరపాలన్న వైసీపీ డిమాండ్లపైనా విరుచుకుపడ్డారు.
‘ఎందుకయ్యా విచారణ? ఏం జరిగిందని విచారణ? ఎవరి డబ్బులు పెట్టి వారు భూములు కొనుక్కుంటే నాకేం సంబంధం? అగ్రిగోల్డ్ భూములు కోర్టు కేసులో అటాచ్ అయ్యాయి. వాటికి లోకేశ్ పేరుతో ముడిపెడితే ఏమిటి దాని అర్థం? ఎక్కడికి పోతున్నారు. మీకు పిచ్చా? రాసేవాడికి బుద్ధుందా?' అంటూ మండిపడ్డారు. పక్కవాళ్లపై బురద చల్లి తుడుచుకోమన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఎక్కడైనా అవినీతి ఉంటే చర్యలు తీసుకోవచ్చని, అంతేగానీ భూములు కొనుక్కుంటే కాదని స్పష్టం చేశారు. తన ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా తాట తీస్తానని తెలిపారు. ఎవరో భూములు కొనుక్కుంటే అది తమకు అనవసరమని, తనకు కావలసింది నిబంధనలు పాటించారా లేదా అన్నదే అని చంద్రబాబు తెలిపారు.
రాజధానికి సంబంధించిన 55 వేల ఎకరాలు ఎక్కడికీ పోలేదని, అక్కడే ఉన్నాయని తెలిపారు. రైతుల వాటా భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాల్సి ఉందన్నారు. ‘రైతులకు భూమి ఎక్కడ ఇస్తామో ఇంకా తెలియదు కదా! నిబంధనలను మార్చారని, అవినీతి జరిగిందని, సీబీఐ విచారణ వేయాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ప్రతి ఒక్కరికీ హద్దులుంటాయని, బురద జల్లి తుడుచుకోమంటారా? ఎందుకంత హజం మీకు? అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు.
సాక్షి పత్రిక ప్రజల ఆస్తి...
జగన్ పత్రిక ఆస్తులు పలు కేసుల్లో అటాచ్ అయ్యాయని, ఆ పత్రిక ప్రజల ఆస్తి అని చంద్రబాబు అన్నారు. అలాంటి పత్రిక అమరావతి నగరంపై 24 గంటలూ విషం చిమ్ముతోందని మండిపడ్డారు. గుడ్డ కాల్చి ముఖం వేసినట్లుగా ఆ రాతలు ఉన్నాయని, ఇష్టానుసారం రాసి ఇమేజీని డామేజీ చేయడమే వారి ధ్యేయమని అన్నారు. వాటిని నిరూపించే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. జగన్ పత్రిక రాసిన రాతలు నిరూపించలేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసు వేయాలా లేక మరేం చేయాలన్న అంశంపై ఆలోచిస్తున్నామన్నారు.
ఎందుకంత అక్కసు, నేను కాబట్టి తట్టుకోగలిగా..
రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలా, లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. కావాలనుకుంటే తమ ఇంటిముందే పెట్టుకోవచ్చు కదా? ఎందుకు మీకింత అక్కసు? ఎంత విషం కక్కారని ప్రశ్నించారు. తాను కాబట్టి తట్టుకోగలిగానని, ఇంకెవరైనా అయితే పారిపోయేవారని అన్నారు.
ఒక్క పిలుపు ఇస్తే రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, రాష్ట్ర పరిస్థితి వివరిస్తే సింగపూర్ వాళ్లు తన మీద నమ్మకంతో ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ అందించారని, ఓవైపు తాను ఇలా ప్రయత్నిస్తుంటే రాజధానిని అడ్డుకోవడానికి రైతుల్ని రెచ్చగొట్టారని, కోర్టులలో కేసులు వేయించారని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రతిపక్షానిది రహస్య ఎజెండా
ప్రతిపక్షానికి రహస్య ఎజెండా ఉందని, దాంతోనే ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తోందని చంద్రబాబు విమర్శించారు. అభివృద్ధి ఆగాలనేదే ప్రతిపక్షం లక్ష్యమన్నారు. ఇబ్బందులున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, వాటి విషయంలో ఏమీ చేయలేక కుల, మత, ప్రాంతీయ రాజకీయాలు నడిపి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తూ 24 వేల కోట్లతో రైతు రుణ మాఫీ, 10 వేల కోట్లతో డ్వాక్రా రుణ సదుపాయం కల్పించడం తమకు మాత్రమే సాధ్యమైందన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎవరికీ ఇవ్వని అవకాశాన్ని ప్రజలు తనకు ఇచ్చారని చెప్పారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత పదేళ్లు ప్రతిపక్ష నేతగా, మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ రాజకీయం నడిపినవారు ఎవరూ లేరని చెప్పుకున్నారు.
నిన్న మొన్న వచ్చినవారు కూడా తనను అసెంబ్లీలో అమర్యాదగా మాట్లాడుతుంటే ప్రజలకోసం భరిస్తున్నానని చెప్పారు. తాను మరికొద్ది రోజుల్లో లండన్ వెళ్తున్నానని, దేశాలు తిరిగి తాను ఎందుకు పెట్టుబడులు అడుక్కోవాలని ప్రశ్నించారు. ప్రతిపక్షాల తీరుపై ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.
పసుపు చొక్కాల వారికి ఇస్తే తప్పేంటి?
కాపు కార్పొరేషన్ సాయం పసుపు చొక్కాలకే పరిమితమైందన్న ఆరోపణలకు ముఖ్యమంత్రి ఘాటుగా సమాధానమిచ్చారు. పసుపు చొక్కాలవారికి ఇవ్వకూడదా? వారు సమాజంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 30 మంది టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలకు ఏమీ ఇవ్వకూడదా అని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సర్పంచ్ నుంచి ఎంపీవరకు మావారినే గెలిపించారని, అలాంటి ప్రజలకు ఏమీ ఇవ్వకూడదా అని అన్నారు
ఓనర్లకే ప్యాకేజీ
అసైన్డ్ భూముల విషయంలో రాజధాని ప్రకటన వచ్చేనాటికి ఎవరు యజమానులుగా ఉంటే వారికే ప్యాకేజీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఆ తర్వాత కొనుగోలు చేసిన వారికి కాకుండా ఒరిజినల్ యజమానులకే ప్యాకేజీ చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై శుక్రవారం సమీక్ష చేస్తానని, తర్వాత ప్రకటన చేస్తామని చెప్పారు.