జగన్ అరెస్టు, సెకీ డీల్ రద్దు- వెనకడుగుకు కారణం చెప్పిన చంద్రబాబు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో అదానీ ఎనర్జీ నుంచి పాతికేళ్ల పాటు 12 వేల మెగావాట్ల సౌర విద్యుత్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంపై వివాదం నెలకొంది. సౌర ఒప్పందాల కోసం భారత్ లో ప్రభుత్వాలకు లంచాలు ముట్టజెప్పారంటూ అమెరికా కోర్టులో అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీపై అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సౌర ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వ పెద్దకు కూడా 1750 కోట్ల లంచాలు అందినట్లు అమెరికా కోర్టులో నమోదైన అభియోగాల్లో పేర్కొన్నారు.
అయితే ఇంత జరుగుతున్నా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న రూ.7 వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని రద్దు చేసేందుకు కానీ, రూ.1750 కోట్ల లంచం ఆరోపణలపై అప్పటి సీఎం వైఎస్ జగన్ ను కానీ ఎందుకు అరెస్టు చేయడం లేదనే ఒత్తిడి చంద్రబాబుపై పెరుగుతోంది. అయితే చంద్రబాబు మాత్రం అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని గతంలో అసెంబ్లీలో వెల్లడించారు. కానీ తాజాగా ఈ రెండు పనులు తాను ఎందుకు చేయడం లేదో ఓ చిట్ చాట్ లో వెల్లడించారు.

గతంలో సౌర ఒప్పందాల విషయంలో లంచం తీసుకున్నారంటూ వైఎస్ జగన్ పై వచ్చిన ఆరోపణలు ఆయన్ను అరెస్టు చేయించడానికి తనకు లడ్డూలాంటి అవకాశం అని సీఎం చంద్రబాబు తాజాగా చెప్పుకొచ్చారు. అయినా జగన్ పై కక్ష తీర్చుకోవడం, అరెస్టు చేయించడం తన లక్ష్యమైతే ఆ పని తాను అధికారంలోకి రాగానే చేసేవాడినన్నారు. తమ పార్టీ శ్రేణులు ఆలోచించే దానికీ, తన ఆలోచనకూ చాలా తేడా ఉందన్నారు. తద్వారా తనను అరెస్టు చేయించిన జగన్ అరెస్టుకు తాను సిద్ధంగా లేనన్నారు.
మరోవైపు అదానీ ఎనర్జీతో గత వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో అక్రమాలు జరిగాయని అప్పట్లోనే ప్రస్తుత ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం రద్దు చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది. అయినా ముందుకు రాకపోవడంపైనా చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఈ ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి వస్తుందని ఆయన వెల్లడించలేదు. అదే కారణంతో తాను ఈ వివాదాస్పద ఒప్పందం రద్దు చేయడం లేదని చంద్రబాబు తేల్చేశారు.












Click it and Unblock the Notifications