ప్రతిష్టాత్మకంగా పుష్కరాలు: చంద్రబాబు సమీక్ష(ఫొటోలు)
హైదరాబాద్: గోదావరి పుష్కరాలను దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. గోదావరి పుష్కరాల పనులపై గురువారం ఆయన సచివాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దక్షిణ గంగగా గోదావరిని ప్రమోట్ చేయాలని సూచించారు.
పుష్కరాల కోసం కేటాయించిన 1295 కోట్ల రూపాయల్లో ఇప్పటి వరకు 244.15 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని, మరో 701.52 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. రోడ్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర పుష్కర పనులు అన్నింటిలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసే వసతుల కల్పనలో జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా ఉండాలని ఆదేశించారు.
పుష్కరాల సమయంలో భారీఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, సినీరంగ ప్రముఖులు పాల్గొనేలా చూడాలని సూచించారు. ఫుడ్ఫెస్టివల్, ఫ్లవర్ ఫెస్టివల్ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. రాజమండ్రి తదితర ప్రాంతాల్లో చేపట్టే సుందరీకరణ పనులు శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజమండ్రిలో 1600 తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం చేపట్టినట్టు అధికారులు వివరించారు. శానిటేషన్ పనుల్లో 1500మంది నిరంతరం నిమగ్నమై ఉంటారని వివరించారు. అన్ని పురపాలక సంఘాల్లో 5000 నుండి 6000 మంది వరకు వర్కర్లు పని చేస్తారన్నారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో ఐదుచోట్ల బిఎస్ఎన్ఎల్, ప్రైవేట్ ఆపరేటర్లు వైఫై హాట్స్పాట్ సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
లక్షలాది మంది భక్తులు వస్తుండటం వల్ల సెల్ఫోన్లు జాంకాకుండా చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. పుష్కరాల సమయంలో భారీ భద్రత ఏర్పాటు చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా 200 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్కుమార్ తెలిపారు. పుష్కరాల తొలిరోజు 50వేల ఆకాశదీపాలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు టూరిజం కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ తెలిపారు.
క్రీడాకారులతో పుష్కర జ్యోతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 300 కిలోమీటర్ల పరిధిలో జ్యోతి మారథాన్ సాగుతుందని శాప్ అధికారిణి ఈ సందర్భంగా తెలిపారు. పుష్కరాల్లో పాల్గొనాలంటూ ఆహ్వానించే కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు తదితరులకు ఆహ్వానించేందుకు ఆహ్వాన పత్రంతోపాటు తిరుపతి లడ్డూలను అందించాలని సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
గోదావరిపై లేజర్ షో సైతం నిర్వహిస్తున్నట్టు వివరించారు. పుష్కరాలు జరిగే 12 రోజులపాటు గోదావరికి అఖండహారతి, మిగతారోజుల్లో నిత్యహారతికి ఏర్పాట్లు చేయాలని సిఎం సూచించారు. పుష్కరాల సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ఘనంగా, శాస్ర్తియంగా జరిగేలా చూడాలన్నారు.