విశాఖ కుదుటపడ్డాకే వెళ్తా: బాబు, మోడీ స్పందించారని
విశాఖపట్నం: హుధుద్ తుఫాను కారణంగా అవస్యస్థంగా మారిన విశాఖనగరం కుదుటపడ్డాకే తాను నగరాన్ని విడిచివెళ్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తుఫాను కారణంగా విశాఖనగరంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. ముందుచూపుతో ప్రాణనష్టాన్ని తగ్గించామని తెలిపారు.
రోడ్ల క్లియరెన్స్ సాయంత్రం వరకు పూర్తవుతుందని చెప్పారు. మొన్నటితో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడిందని అన్నారు. కూరగాయల సమస్యను తీర్చేందుకు కొన్ని వందల టన్నులను ఉత్తరాంధ్ర జిల్లాలకు పంపిస్తున్నామని చెప్పారు. రూ. 3కే కూరగాయలు, రూ. 5కే కిలో ఆలుగడ్డలు అందిస్తున్నట్లు తెలిపారు. 25కిలోల బియ్యాన్ని, ఆలుగడ్డలు, పామాయిల్, మిరప్పొడి, ఉప్పు లాంటి నిత్యావసర వస్తువులను చౌక ధరల దుకాణాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.
చేనేత, మత్స్యకారులకు 50కిలోల బియ్యం, నిత్యావసరాలు అందిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తాము నష్ట నివారణకు తీసుకున్న చర్యలపై బ్లూ ప్రింట్ విడుదల చేసి అన్ని రాష్ట్రాలకు పంపుతామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్పందించిన తీరు బాగుందని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్లో కంట్రోల్ రూం కొనసాగిస్తున్నామని చెప్పారు. తుఫాను ఒక రోజు తర్వాతే తాము తాగునీటిని ప్రజలకు అందించామని చెప్పారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశాఖలోని 10 మురికి వాడల్లో మెడికల్ క్యాంపులు పెడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. 9లక్షల కుటుంబాలకు నిత్యావసరాలు అందించినట్లు తెలిపారు. విశాఖలోని ప్రతీ పౌరుడు చౌక దుకాణాల్లో వస్తువులు తీసుకోవచ్చని అన్నారు. అన్ని నిత్యవాసర వస్తువులు చౌక దుకాణాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
తాను మంగళవారం స్వయంగా పర్యవేక్షించి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అయ్యేలా చూశానని చంద్రబాబు తెలిపారు. విద్యుత్ సరఫరా తమ ముందున్న ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ సాయంత్రం వరకు దాదాపు అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తామని చెప్పారు. ప్రజలకు తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. మరో రెండ్రోజుల్లో కేంద్రబృందం వస్తుందని చెప్పారు. విశాఖ ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని తెలిపారు. పరిశ్రమలకు కూడా తుఫాను వల్ల అపార నష్టం వాటిల్లిందని చెప్పారు. శనివారం వరకు విశాఖ నగరంలోనే ఉండి చంద్రబాబు నాయుడు పరిస్థితులను సమీక్షించనున్నారు.