కలెక్టర్లపై పోరాటం చేస్తా, అవసరమైతే నిరాహార దీక్ష చేస్తా: చంద్రబాబు
శ్రీకాకుళం: అవసరమైతే తాను ఒకరోజు నిరాహార దీక్ష చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు పాటు పడతామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో ప్రతీ కుటుంబానికి మరుగుదొడ్డి ఉండాలని దీనిపై జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
జగన్ ఇలాకాలో షాక్: గో బ్యాక్, మైక్ లాక్కున్నారు, వెళ్లిపోయిన అవినాశ్, బాబు రాకముందే కలకలం
అవసరమైతే కలెక్టర్లపై నిరాహార దీక్ష
అవసరమైతే ఒక రోజుల్లా నిరాహార దీక్ష చేసి సమస్య పరిష్కారానికి కలెక్టర్ల పైన తాను పోరాటం చేస్తానని చంద్రబాబు అన్నారు. సమాజంలో అసమానతలు పోవాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రజల భవిష్యత్తు కోసం తాను రాత్రి పగలు అనకుండా కష్టపడుతున్నానని చెప్పారు.
విభజన వల్ల కష్టాలు
విభజన వల్ల అనేక కష్టాలు పడ్డామని, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెరగాలని అన్నారు. జన్మభూమిలో గురువారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంశాన్ని తీసుకున్నామని చెప్పారు.
31వ తేదీలోగా ప్రతి ఇంటికి
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత చాలా అవసరమని చంద్రబాబు అన్నారు. పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారని, గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.15వేలు ఇస్తున్నామని చెప్పారు. మరుగుదొడ్లపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. మార్చి 31లోగా ప్రతీ ఇంటికి మరుగుదొడ్డు ఉండాలన్నారు.
చెంబు శవయాత్రపై
పలుచోట్ల చెంబు శవయాత్ర పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అది చాలా సంతోషమని చంద్రబాబు అన్నారు. ఆరు జిల్లాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని, మరో ఏడు జిల్లాల్లో పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. వారం అంతా మనకోసం పని చేసుకుందామని, కానీ, శనివారం మాత్రం పరిసరాల పరిశుభ్రతకోసం పని చేయాలన్నారు.