పవన్ వందశాతం నిజం చెప్పారు, నేనే చేస్తా: బాబు
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంద శాతం నిజం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన విషయంలో కుట్ర చేశారని పవన్ కళ్యాణ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్లతో కలిసి ఆయన తిరుపతిలో వేదికను పంచుకుని బుధవారం సాయంత్రం ప్రసంగించారు. కెసిఆర్, జగన్లతో కలిసి రాష్ట్ర విభజనకు కాంగ్రెసు కుట్ర చేసిందని ఆయన అన్నారు. తాను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదివానని, ప్రజల అభిమానం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.
నరేంద్ర మోడీ దేశ ప్రధాని అవుతారనే విషయంలో తనకు ఏ విధమైన సందేహం లేదని ఆయన అన్నారు. విభజన అవమానకరంగా చేశారని ఆయన అన్నారు. కోపం, ఆవేదన కలుగుతోందని, దారుణంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. తప్పుడు విధానాలకు 125 ఏళ్ల కాంగ్రెసు జీరో అయిందని ఆయన అన్నారు. తెలంగాణలో 40 శాతం మంది, సీమాంధ్రలో 60 శాతం మంది ప్రజలున్నారని, రాష్ట్ర విభజన జరగాలంటే సీమాంధ్రను ఒప్పించాలని తాను చెప్పానని చంద్రబాబు అన్నారు. సోనియా జాగీరు మాదిరిగా ఇష్టారాజ్యంగా చేశారని ఆయన విమర్శించారు.
రాష్ట్ర విభజనకు కెసిఆర్, జగన్లతో కాంగ్రెసు కుట్ర చేసిందని విమర్శించారు. తెలంగాణలో వెంకయ్య నాయుడిని తిట్టారు, పవన్ కళ్యాణ్నూ తిట్టారని, జగన్ను ఎక్కడా తిట్టలేదని ఆయన తెరాసను ఉద్దేశించి అన్నారు. తాను తెలంగాణ వెళ్తే రాళ్ల వర్షం, జగన్ వెళ్తే పూలవర్షమని అన్నారు. అక్కడ అద్దె పుత్రుడు (కెసిఆర్), ఇక్కడ దత్త పుత్రుడు (జగన్) అని అన్నారు. కెసిఆర్ బయటపడ్డారని, మోడీ స్వయంగా అడిగినా మద్దతు ఇవ్వబోనని కెసిఆర్ చెప్పాడని, రాహుల్ గాంధీకి మద్దతిస్తానని చెప్పాడని ఆయన అన్నారు

తనకు ఏమీ అవసరం లేదని, సీమాంధ్రకు న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని చెప్పిన జాతీయ నాయకుడు మోడీ ఒక్కరేనని ఆయన అన్నారు. విభజన హేతుబద్దంగా ఉండాలని చెప్పారని, కాంగ్రెసు విధానాన్ని తప్పు పట్టారని, సీమాంధ్రలకు వెళ్లి చూసి రావాలని సోనియాకు సవాల్ విసిరారని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్ర విభజన విషయంలో బిడ్డను బతికించాలని తల్లిని చంపేశారని మోడీ అన్నారని ఆయన అన్నారు.
సీమాంధ్రకు అండగా ఉంటామని తాను, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ హామీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. సీమాంధ్రకు న్యాయం చేస్తానని మోడీ చెప్పారని ఆయన అన్నారు. హైదరాబాద్ను, సైబరాబాద్ను తానే నిర్మించానని, తిరుపతిని మరో హైదరాబాద్గా చేస్తానని చంద్రబాబు అన్నారు. కెసిఆర్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, కెసిఆర్కు భయపడే ప్రసక్తి లేదని చంద్రబాబు అన్నారు. అలాంటివి జరగకుండా హైదరాబాదును కాపాడాలని, తెలంగాణకు కూడా న్యాయం చేయాలని ఆయన అన్నారు.
తాను కసితో, కోపంతో, బాధతో ఉన్నానని, అవసరమైతే కూలీగా పనిచేస్తానని, చెట్ల కింద కూర్చుని అద్భుతమైన రాజధానిని నిర్మించుకుందామని చంద్రబాబు అన్నారు. భారతదేశం అశ్చర్యపడేలా సీమాంధ్రను అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా హైదరాబాదులో కాకుండా సీమాంధ్రలోనే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications