జగన్ ఆస్తుల్ని అందుకే స్వాధీనం చేసుకోలేకపోతున్నా, పరువుపోయింది: బాబు, మోడీపై అసహనం
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆస్తులు మనం స్వాధీనం చేసుకోవడం కష్టమని చెప్పారు.
Recommended Video
అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆస్తులు మనం స్వాధీనం చేసుకోవడం కష్టమని చెప్పారు.
అందుకే మనం ఏం చేయలేకపోతున్నాం
జగన్ అవినీతి ఆస్తుల్ని, సాక్షి పత్రికను కేంద్రం స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. అవి సీబీఐ, ఈడీ పరిధిలో ఉన్నాయని, అందుకే మనం ఏం చేయలేకపోతున్నామన్నారు. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను అనుసరించి ఎప్పుడో స్వాధీనం చేసుకునేవారిమన్నారు. సత్యం వంటి స్కాముల్లో చేసినట్టే కేంద్రం ఇక్కడ కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎంత సంపాదించినా పట్టుబడితే, నోట్ల రద్దుపై ఇలా
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన చట్టం ప్రకారం ఆ ఆస్తులను జప్తు చేసే అధికారం ఉందని చంద్రబాబు అన్నారు. ఏసీబీ కేసుల్లో దొరికిన భారీ అవినీతిపరులందరి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని, త్వరలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమ మార్గాల్లో ఎంత సంపాదించినా ఎప్పటికైనా పట్టుబడితే ఆ డబ్బు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటేనే అవినీతి తగ్గుతుందన్నారు. అందుకే నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిచ్చానన్నారు.
పరువు పోయింది, జగన్ పద్ధతిగా ఉండే వ్యక్తి కాదు
పారడైజ్ పేపర్లలో జగన్ పేరుతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నదని చంద్రబాబు అన్నారు. తాను పాజిటివ్ ఇమేజ్ కోసం చూస్తుంటే, జగన్ చెడగొడుతున్నారని మండిపడ్డారు. జగన్ పద్ధతిగా ఉండే మనిషి కాదన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు నదుల అనుసంధానం చేయాలని ఆయనకు సూచించానని చెప్పారు.
జగన్ను చూసి ఇప్పటికీ భయపడుతున్నారు
జగన్ అవినీతి చరిత్ర తెలిసినవాళ్లు రాష్ట్రంలో ఇప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు గెలవకపోతే మా పరిస్థితి ఏమిటి అని వాళ్లు అడుగుతున్నారని, ఆ పరిస్థితి రాదని మేం ఓడిపోయే సమస్యేలేదని వారికి చెబుతున్నా అన్నారు. జగన్ లాంటి వారు 2019లో వస్తే ఏమిటనే ఆందోళన పెట్టుబడిదారుల్లో ఉందని, కానీ తాము వైసీపీ రాదని ధీమాగా చెబుతున్నానన్నారు.
జగన్ ఉంటే గొడవ తప్ప ఏమీ లేదు
పాదయాత్రతో ఎవరూ సీఎం కాలేరని చంద్రబాబు అన్నారు. షర్మిల కూడా పాదయాత్ర చేశారు మరి ఆమె సీఎం కాలేదేం అని ప్రశ్నించారు. 2009కి ముందు నేను కూడా బస్సు యాత్ర చేశా, ఇబ్బందులు పడ్డా కానీ గెలవలేదన్నారు. వైసీపీ సభకు వస్తే ఎలా అడ్డుకోవాలి, ఎవరిని తిట్టాలి, సీఎంను ఎలా అవమానించాలనే ఉద్దేశ్యంతోనే వచ్చేవారు అన్నారు. జగన్ సభలో ఉంటే అల్లరి, గొడవ, సమావేశాలను అడ్డుకోవడం తప్ప వేరే కార్యక్రమాలు లేవన్నారు.
కేంద్రంపై అసంతృప్తి
ఉపాధి హామీ నిధుల్ని బాగా ఖర్చు పెట్టి, పనులు చేసిన రాష్ట్రంగా ఏపీని నమూనాగా చూపించాల్సింది పోయి, నిధులిచ్చేందుకు కేంద్రం కొంత ఇబ్బందులు పెడుతోందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్లధనం దేశాన్ని నడపకూడదన్నారు.