జగన్ వైరస్ కి మందు లేదు; రాష్ట్రవిభజన కంటే వైయస్ జగన్ చేసిన డ్యామేజ్ ఎక్కువ: చంద్రబాబు
ఏపీ సర్కార్ పై, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కి మందు ఉందేమో కానీ జగన్ వైరస్ కి మందు లేదని చంద్రబాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన చంద్రబాబు జగన్ సర్కార్ పాలనా వైఫల్యాలను ఏకరువు పెట్టారు.

రాష్ట్రానికి వైసిపి గ్రహణం పట్టింది
రాష్ట్ర విభజన కంటే వైయస్ జగన్ చేసిన డ్యామేజ్ నుంచి రాష్ట్రం కోలుకోవడం చాలా కష్టమని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వైసిపి ధ్వంసం చేసిందని, రాష్ట్రానికి వైసిపి గ్రహణం పట్టిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఉద్యోగులకు చరిత్రలో ఎవరు ఇవ్వనంత ఫిట్మెంట్ టిడిపి ఇచ్చిందని పేర్కొన్న ఆయన, ప్రభుత్వ ఉద్యోగులను జగన్ మోసం చేశారని విమర్శించారు. ప్రస్తుతం ఏపీ అప్పు ఏడు లక్షల కోట్లకు చేరుకుందని మండిపడిన చంద్రబాబు జగన్ రెడ్డి పాలనలో ఒక్క పెట్టుబడి కూడా రాలేదంటూ విమర్శలు గుప్పించారు.

ప్రజలు మర్చిపోయినా జగన్ రెడ్డిని చరిత్ర క్షమించదు
అసెంబ్లీ సమావేశాలలో బూతులు తప్ప ఏమీ లేవని, ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీకి అధికారం కొత్త కాదని, ప్రతిపక్షం కొత్త కాదని పేర్కొన్న చంద్రబాబు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఈ సమాజానికి కొత్తగా ఉన్నాయి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి పుట్టక ముందు ఇచ్చిన ఇళ్లకు కూడా ఇప్పుడు ఓటీఎస్ కట్టాలి అని చెప్పడం దారుణమని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డికి వ్యక్తిత్వం లేదని, విశ్వసనీయ అంతకంటే లేదని విమర్శించారు చంద్రబాబు. ప్రజలు మర్చిపోయినా జగన్ రెడ్డిని చరిత్ర క్షమించదని ఆయన పేర్కొన్నారు.
చెత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం
చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది అని పేర్కొన్న చంద్రబాబు, చెత్త పన్ను కట్టకుంటే ఇంటి ముందు చెత్త వెయ్యాలని ఓ మహా నాయకుడు చెబుతున్నారంటూ వైసీపీ నేతను టార్గెట్ చేస్తూ ఎద్దేవా చేశారు. పేదలకు ఇళ్లు మాత్రమే కాదు ఆస్తి ఇచ్చిన ఘనత కూడా టిడిపి దేనని పేర్కొన్నారు చంద్రబాబు. టిడ్కో ఇల్లు ఇవ్వడానికి కూడా సీఎంకు మనసు రాలేదని దుయ్యబట్టారు చంద్రబాబు. అన్ని రంగాలను జగన్ నాశనం చేస్తున్నారని, విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని జగన్ భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ ఇచ్చిన పెన్షన్ కూడా తామే ఇచ్చినట్టు చెప్తున్న వైసీపీ
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 2000 రూపాయల పెన్షన్ ను కూడా తాము ఇచ్చామని జగన్ సిగ్గులేకుండా చెబుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే మూడు వేల రూపాయల పింఛన్ ఇచ్చే వాళ్ళమని చంద్రబాబు పేర్కొన్నారు . న్యాయ వ్యవస్థ పైన గతంలో ఎవరూ చేయని విధంగా విమర్శలు చేశారని మండిపడ్డారు. జగన్ దూరదృష్టి లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

మద్యం ముడుపుల కోసమే ఆన్ లైన్ పేమెంట్ లేకుండా చెల్లింపులు
ఒక్కరోజులోనే రాష్ట్రంలో నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల మద్యం తాగేశారని, మద్యం ముడుపులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు మద్యం దుకాణాల్లో ఆన్లైన్ పేమెంట్ లో వ్యవస్థను పెట్టలేదని ఆరోపించారు చంద్రబాబు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు రోడ్డు మీద పడిన పరిస్థితి ఉందని మండిపడ్డారు. పార్లమెంట్ అయినా జరుగుతుంది కానీ అసెంబ్లీ జరగడం లేదంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు.












Click it and Unblock the Notifications