బాంబులేస్తామంటే భయపడతామా? కుప్పంలోకి రౌడీలు, గూండాలంటూ చంద్రబాబు, సభలో కలకలం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టేది తెలుగుదేశం పార్టీనేనని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు శుక్రవారం పర్యటించారు. కుప్పం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఏపీలో వింత వింత మద్యం బ్రాండ్లు: చంద్రబాబు
పేదల కోసం ధర్మ పోరాటం చేస్తున్న తనను ప్రలే కాపాడుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వింత వింత మద్యం బ్రాండ్లు తెచ్చారని అన్నారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కరోనా సమయంలో కూడా మద్యం షాపులు తెరిచారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కొత్త రకం మద్యం బ్రాండ్లు తెచ్చి.. రేట్లు విపరీతంగా పెంచేశారన్నారు.

చర్యలు తీసుకోమంటే టీడీపీపై దాడులు, కేసులు: చంద్రబాబు ఫైర్
విశాఖ ఏజెన్సీలో 25వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్నారని, రూ. 8వేల కోట్ల విలువైన గంజాయి సరఫరా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కోరితే టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారన్నారు. అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం ఉందని రాష్ట్రపతికి తెలిపినట్లు చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారన్నారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్నా టీడీపీ కార్యాలయంపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

బాంబులకు భయపడే వ్యక్తిని కానంటూ చంద్రబాబు
తనపై బాంబులు వేస్తామని అంటున్నారని చెప్పారు. బాంబులకు భయపడే వ్యక్తిని కాదని చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులకు భయపడి పార్టీ మూసేయాలా? అని మండిపడ్డారు. బాబాయిని చంపినోడు భయపడాలి కానీ.. తామెందుకు భయపడతామని అన్నారు. కోడి కత్తి కేసు ఏమైందని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం వాళ్లు చేసుకున్నారు.. మనం కాదు.. టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో రాగానే కమిషన్ వేస్తామని చెప్పారు. టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారన్నారు. పోలీసులను ఉసిగొల్పుతూ తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
Recommended Video

చంద్రబాబు సభలో బాంబు కలకలం
కుప్పం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థిలు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి బహిరంగ సభ వద్దకు చేరుకుని కలకలం సృష్టించాడు. టీడీపీ కార్యకర్తలు అతడ్ని పట్టుకున్నారు. బాంబు తెచ్చాడంటూ అనుమానం వ్యక్తం కావడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తెరిచి ఆయనకు రక్షణగా ఉన్నారు. ఇక వైసీపీ గూండాయిజం నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి.
కాగా, డబ్బు సంచులతో కుప్పం వస్తున్నారు.. కుప్పంలోకి రౌడీలు, గూండాలు ప్రవేశించారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం కుప్పం పర్యటన చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.












Click it and Unblock the Notifications