వైసీపీకి ఓటేస్తే పన్నుల బాదుడే- విశాఖలో చంద్రబాబు- హుదుద్ సాయం గుర్తు చేస్తూ ప్రచారం
ఏపీలో వైసీపీ సర్కారు తీరుపై విశాఖపట్నంలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మరోసారి నిప్పులు చెరిగారు. ఎర్రటి ఎండలో జీవీఎంసీ ఎన్నికల ప్రచారాన్ని రోడ్షో ద్వారా నిర్వహించిన చంద్రబాబు... పలు ప్రాంతాల్లో పర్యటించారు. స్ధానిక అభ్యర్ధులకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధించారు. ఎన్నికలు ముగియగానే పన్ను బాదుడుకు వైసీపీ సర్కారు సిద్ధమవుతోందని, గతంలో తాను హుదుద్ తుఫాను సందర్భంగా మీకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని విశాఖ ఓటర్లను చంద్రబాబు కోరారు.
విశాఖలో చంద్రబాబు రోడ్షోలు
విశాఖ నగర పాలక సంస్ధ జీవీఎంసీకి జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ఇవాళ ప్రచారం చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో ఆయన రోడ్షోలు నిర్వహించారు. ఎక్కడికక్కడ స్ధానిక అభ్యర్ధులను వెంటబెట్టుకుని తిరిగిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వ పాలనతో జరుగుతున్న అకృత్యాలను ఎండగట్టారు. విశాఖ నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూనే వైసీపీకి ఎందుకు ఓటు వేయకూడదో చంద్రబాబు ఓటర్లకు వివరించారు.
విశాఖకు ఏ2 శని పట్టిందన్న చంద్రబాబు
విశాఖలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. విశాఖ జిల్లాకు ఏ2 శని పట్టిందంటూ విజయసాయిరెడ్డిని పరోక్షంగా విమర్శించారు. నగరంలో తమ మాట వినకపోతే చిన్న వ్యాపారులపైనా కేసులు పెడుతున్నారని, విజిలెన్స్, కమర్షియల్ అధికారులతో దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి బాధ్యతలేని ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలిస్తూ అతలాకుతలం చేసే పరిస్ధితి వచ్చిందని విపక్ష నేత వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు.
ఏప్రిల్ 1 నుంచి పన్నుల బాదుడే
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో భారీగా పన్నులు పెంచేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని చంద్రబాబు విశాఖ ప్రచారంలో ఆరోపించారు. ఇప్పటికే ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన బ్రాండ్ల మద్యం అమ్ముతూ భారీగా బాదేస్తున్నారని, ఇది చాలక దీని ఆదాయాన్ని చూపుతూ కొత్తగా అప్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఏప్రిల్ 1 నుంచి మున్సిపల్ పన్నులన్నీ పెంచేయబోతున్నారని, అదీ మామూలు పెంపు కాదని చంద్రబాబు తెలిపారు. ఖాళీ స్ధలం లేదా ఇంటికి రూ.50 వేల వరకూ పెంచబోతున్నారని,. లక్షకు మేం రూ.5 వేలు పన్ను వసూలు చేస్తే ఇప్పుడు దాన్ని రూ.50వేలు చేయబోతున్నారని చంద్రబాబు ఆరోపించారు. షాపుల విలువ కోటి రూపాయలుంటే 2 లక్షల పన్ను వేయబోతున్నారని ఆక్షేపించారు. చివరికి కుక్కలు, పందులు, గాడిదలమీదా పన్నులు వేసేలా ఉన్నారన్నారు.. గాడిదలు కూడా నిరసన తెలియజేసే పరిస్ధితి వచ్చేలా ఉందన్నారు. తాగే నీరు, పీల్చే గాలి పన్నుపైనా పన్ను వేయబోతున్నారు. ఇలాంటి ప్రభుత్వం కావాలా ఆలోచించుకోవాలని ప్రజలకు చంద్రబాబు ప్రశ్నించారు
జగన్ పాలనలో నిత్యావసరాలకు రెక్కలు
ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ లేని బ్రాండ్ల మద్యం తెచ్చి భారీగా వసూలు చేస్తున్నారని, ఇది చాలక పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారని చంద్రబాబు ఆరోపించారు. త్వరలోనే ఇవి సెంచరీ కొట్టడం ఖాయమన్నారు. గ్యాస్ బండ కూడా గుదిబండగా మారిపోయిందని చంద్రబాబు విశాఖలో విమర్శించారు. చింతపండు, పప్పు ధాన్యాలు, చక్కెర దరలు పెరిగాయని, కానీ మీ ఆదాయమే పెరగలేదని విశాఖ ఓటర్లను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వానికి ఓటేస్తే త్వరలో కరెంటు ఛార్జీలు సహా ఇతర అన్ని ఛార్జీలు పెంచే అవకాశం ఉందన్నారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి ఇవి తప్పవని వైసీపీ నేతలు చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు.
హుదుద్ సాయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు
విశాఖలో 50 వేల మందికి పట్టాలు పంచేసి ఇళ్ల స్ధలం ఎక్కడో కూడా చెప్పలేదని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు ఇళ్లస్ధలం ఇచ్చేశా.. ఓట్లువేయమని అడుగుతున్నారని వైసీపీ సర్కారుపై చంద్రబాబు మండిపడ్డారు. హుదుద్ వచ్చినప్పుడు తాను విశాఖ ప్రజల కష్టాలు చూశానని, బస్సులో పడుకున్నానని గుర్తుచేశారు. విజయవాడ, కాకినాడ, రాజమండ్రిలో వంటలు చేయించి ఇక్కడ జనాలకు భోజనాలు పెట్టానని చంద్రబాబు గుర్తుచేశారు. తద్వారా తాను విశాఖ ప్రజలకు అండగా నిలిచానని చంద్రబాబు తెలిపారు. ఆ సాయాన్ని ప్రజలు ఓసారి గుర్తు చేసుకోవాలని విశాఖ ఓటర్లను చంద్రబాబు కోరారు.