జగన్ వల్ల చెప్పలేకపోయా, ఇచ్చింది తీసుకుంటాం: బాబు, సభలో వాగ్వాదం
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తన ప్రకటనలో నాలుగు విషయాలు చెప్పారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన మండలిలో చెప్పారు. నాటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరినట్లు చెప్పారు.
కేంద్ర ప్యాకేజీ పైన ఆయన మండలిలో గురువారం ప్రకటన చేశారు. మనం చెప్పేది కూడా వినే పరిస్థితుల్లో ప్రతిపక్షం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. అసెంబ్లీలో తనకు ప్యాకేజీ పైన ప్రకటన చేసే అవకాశం రాలేదన్నారు. ప్రభుత్వం వాదను వినే స్థితిలో వైసిపి లేదన్నారు.
ప్రస్తుతం అన్ని విషయాల్లోను ఏపీ ఇబ్బందుల్లో ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం చాలాసార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పారు. ఏపీ చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పారు. ఆదాయం సహా అన్ని అంశాల్లో ఏపీ ఇబ్బందుల్లో ఉందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును కూడా కొందరు వ్యతిరేకించారని చెప్పారు.
ఇప్పుడు పట్టిసీమ వల్ల రైతులకు నీటి కష్టాలు లేకుండా పోయాయాన్నారు. 2018లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చును వంద శాతం ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు. తాజా అంచనాల మేరకు పోలవరంకు రూ.25వేల కోట్ల నుంచి రూ.30వేల కోట్లు కావాలన్నారు.
మంత్రి పదవులు ముఖ్యం కాదు
నాడు వాజపేయి హయాంలో మనకు చాలామంది ఎంపీలు ఉన్నారని, మనం అడిగితే ఏడెనిమిది మంత్రి పదవులు వచ్చేవన్నారు. కానీ మనం అప్పుడు మంత్రి పదవుల కోసం చూడలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం చూశామన్నారు. అందుకే బాలయోగిని స్పీకర్గా చేశామన్నారు. తమకు కేంద్ర మంత్రి పదవులు ముఖ్యం కాదని చెప్పడం ద్వారా జగన్కు కౌంటర్ ఇచ్చారు.
అధికారం కోసం తాము ఎప్పుడూ తాపత్రయపడలేదన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రంలో సెంటిమెంటుగా మారిందన్నారు. ప్రతిదానికి రాజీనామాలు అడగటం సరికాదన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని, కానీ హోదా వల్ల వచ్చే ప్రతి బెనిఫిట్ను ప్యాకేజీ ద్వారా అందిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. 14వ ఆర్థిక సంఘం సూచనలతో మాకు సంబంధం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు.
2020 తర్వాత కూడా ఏపీ లోటు బడ్జెట్లో ఉంటుందని చెప్పారు. హోదాకు సమానంగా ఏపీకి నిధులిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. 2015 నుంచి 2020 వరకు రావాల్సిన వాటిని ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు. కేంద్రం ఇచ్చింది తీసుకుంటామని, అలాగే రావాల్సినవి అడుగుతామని చెప్పారు.
హైదరాబాద్ను నేనే.. పదే పదే చెప్పనవసరం లేదు
హైదరాబాదును నేనే అభివృద్ధి చేశానని, కానీ దీన్ని తాను పదేపదే చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది సంతోషమన్నారు. మనం హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చామన్నారు. కట్టుబట్టలతో వచ్చిన మనలను కేంద్రం ఆదుకోవాలన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకు ఏపీని కేంద్రం ఆదుకోవాలన్నారు.
అడ్డంకులు సృష్టిస్తున్నారు
రాజధాని అమరావతి విషయంలో కొందరు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు చేశారన్నారు. గ్రీన్ ట్రైబ్యునల్కు వెళ్లారన్నారు. గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉన్నా.. తాను అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్నారు. రాయలసీమన రతనాల సీమ చేస్తామన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
విశాఖ రైల్వే జోన్ పైన ఆందోళనగా ఉంది
విశాఖ రైల్వే జోన్ పైన కొంత ఆందోళనగా ఉందని చంద్రబాబు చెప్పారు. విశాఖకు రైల్వే జోన్ పైన తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీలు రావాలన్నారు. ప్రపంచంలోని ఐదు టాప్ నగరాల్లో అమరావతి ఉండాలనేది తన సంకల్పం అన్నారు.
కాంగ్రెస్ సభ్యులను నిలదీసిన చంద్రబాబు
విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలు ఉన్నారని, అప్పుడు ఏం చేశారని చంద్రబాబు నిలదీశారు. నేను ఢిల్లీలో ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేస్తే మీరెందుకు మాట్లాడలేదన్నారు. అందుకు తగిన ఫలితం (2014లో ఓటమి) మీరు అనుభవించారన్నారు.
నాకు మాట్లాడే అవకాశమివ్వకుండా బిల్లు పాస్ చేసుకున్నారన్నారు. మీ ద్వారా ప్రజలకు చెబుతున్నానని, మీకు ఇష్టం లేకున్నా వినాల్సిందే అన్నారు. వాస్తవాలు ఉంటే ఎవరు మాట్లాడినా విశ్వసనీయత ఉండదన్నారు. నాడు నేను పోరాడిన విషయం దేశానికి తెలియదా అన్నారు. విభజన సమయంలో తాను రెండు ప్రాంతాలకు సమన్యాయం కోసం ప్రయత్నించానన్నారు.
నన్ను దెబ్బతీసేందుకు..
సమైక్య ఏపీలో అందరికంటే ఎక్కువ కాలం సీఎంగా ఉన్నది తానేనని చెప్పారు. నన్ను దెబ్బతీసేందుకు మీరు విభజనను ముందుకు తెచ్చారని, చివరకు మీరే ఓడిపోయారన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు అన్నీ అర్థం చేసుకున్నారు కాబట్టి నాకే ఓట్లు వేసి గెలిపించారన్నారు. కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్యతో ఓ సమయంలో వాగ్వాదం జరిగింది.
ఓ సమయంలో అన్నీ వదిలేయాలంటూ.. చంద్రబాబు చిరునవ్వులు చిందించారు. ఆనాడు విభజనకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని చెప్పారు.
విభజన చట్టంలోని హామీలను అన్నింటిని నెరవేర్చాలని తాను కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు. కేంద్రం ఇస్తానని చెబుతున్న నిధులకు, హోదాకు కచ్చితమైన సమయం ఉండాలన్నారు. ఏ లోగా ఇస్తారో చెప్పాలన్నారు. కేంద్రం హామీలకు చట్టబద్ధత కల్పించాలని కోరామన్నారు.
కేంద్రం ఏ సాయం చేసినా ధన్యవాదాలు తెలుపుతామని, అలాగే మన హక్కుల కోసం డిమాండ్ చేద్దామన్నారు. అభివృద్ధిలో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. తాను మరోసారి చెబుతున్నానని ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్రం విషయంలో రాజీపడనన్నారు. అందరు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. నేను రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానని చెప్పారు.