పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు మీ తీరు చూశా: సొంత నేతలకు బాబు షాక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు, సీనియర్ నేతల తీరు పైన గురువారమే ఆయన మండిపడ్డారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు, సీనియర్ నేతల తీరు పైన గురువారమే ఆయన మండిపడ్డారు. తాజాగా టిడిపి వర్క్ షాప్లోని అసహనం వ్యక్తం చేశారు.
విజయవాడలో టిడిపి వర్క్ షాప్ జరుగుతోంది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చాలామంది నేతలు ఇంకా హాజరు కాలేదు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు నేతల తీరును చూశానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చాలామంది నేతలకు సీరియస్నెస్ ఉండటం లేదని మండిపడ్డారు. ఇలాంటి సమావేశాలకు కూడా ఆలస్యంగా రావడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కూడా ఆయన మంత్రుల పైన మండిపడ్డారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

ఇలా ముందుకు వెళ్తున్నాం
ఇదిలా ఉండగా, టిడిపి వర్క్ షాప్లో చంద్రబాబు మాట్లాడారు. టిడిపికి కార్యకర్తలే బలమని చెప్పారు. వారు లేనిదే పార్టీ లేదన్నారు. 35 ఏళ్లుగా పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నా కార్యకర్తలు వెన్నంటే ఉన్నారని చెప్పారు. పాతవారిలో అనుభవం, కొత్తవారిలో సాంకేతికతతో పార్టీ ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

తప్పు చేస్తే మనకే నష్టం
పార్టీ మీద నమ్మకం ఉంటేనే ప్రజలు ఓట్లేస్తారని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాశ్వతంగా టిడిపినే అధికారంలో ఉండాలని, మన పాలనలో ప్రజల్లో 80 శాతం సంతృప్తి పెరగాలన్నారు. మనం తప్పులు చేసినా ఎవరైనా దుష్ప్రచారం చేసినా పార్టీకే నష్టమన్నారు.

ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం
టిడిపి అధికారంలోకి వచ్చాక ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం పూర్తి చేశామని, పట్టిసీమ లేకుంటే పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు.

అభ్యున్నతికి కృషి
రాష్ట్రం 16వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నా, రైతు రుణమాఫీ చేశామని, డ్వాక్రా మహిళలకు రూ.6,400 కోట్లు రుణమాఫీ చేశామని చంద్రబాబు అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.

స్పీకర్ వ్యాఖ్యలపై..
మహిళల పైన స్పీకర్ కోడెల శివప్రసాద రావు వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ఉపాధి నిధులను మనమే ఎక్కువగా వినియోగించుకుంటున్నామన్నారు.












Click it and Unblock the Notifications