మీ పెత్తనమేంటి: బిజెపి, పురంధేశ్వరిపై బాబు పావులు
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరికి రాజంపేట లోకసభ సీటు ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు గుర్రుమంటున్నారు. పొత్తులో భాగంగా టిడిపి తమ పార్టీకి కేటాయించిన సీట్లలో తమ పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల పైన టిడిపి పెత్తనం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలకు రెండు పార్టీల పొత్తు కొనసాగాలని ఆకాంక్షించారు. దానివల్ల బిజెపి, టిడిపి ఇరువురికీ ప్రయోజనమన్నారు. ఈ దశలో పొత్తుపై పునరాలోచన సరికాదని హితవు పలికారు. పొత్తుపై టిడిపి పునరాలోచన సరికాదన్నారు. సీమాంధ్రలో బిజెపి అభ్యర్థుల ఎంపిక తీరుపై టిడిపి అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో వెంకయ్య పై విధంగా బెంగళూరులో స్పందించారు.

మరోవైపు బిజెపి సీమాంధ్ర చీఫ్, విశాఖ లోకసభ అభ్యర్థి కంభంపాటి హరిబాబు ఘాటుగా స్పందించారు. పొత్తులంటే సమస్యలు సహజమని చెప్పారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుని ముందుకు వెళతామని తెలిపారు. తమ పార్టీకి కేటాయించిన సీట్లలో తాము నిలబెట్టిన అభ్యర్థుల పైన టిడిపి పెత్తనమేమిటని ప్రశ్నించారు.
బిజెపి అగ్రనేతలతో బాబు చర్చలు
బిజెపి నిలబెట్టిన పలువురు అభ్యర్థుల పైన చంద్రబాబు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ప్రధానంగా రాజంపేట లోకసభను పురంధేశ్వరికి కేటాయించడాన్ని బాబు జీర్ణించుకోలేకపోతున్నారట. పలు సీట్లపై తమకు అభ్యంతరాలున్నాయని, అభ్యర్థులను మార్చాలని చంద్రబాబు బిజెపి అగ్రనేతలతో మంతనాలు జరుపుతున్నారట. పలు సీట్లలో మార్పులు, చేర్పులు కోరుతున్నారట.












Click it and Unblock the Notifications