మరొకటి వస్తే తెలంగాణకు, మోడీని అడిగా: చంద్రబాబు
హైదరాబాద్: కేంద్రమంత్రి వర్గంలో తమ పార్టీకి మరో అవకాశం లభిస్తే ఈసారి తెలంగాణకు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం చెప్పారు. సహాయమంత్రి పదవి కోసం మీ పార్టీ నుండి పేరును ప్రతిపాదించాలని ప్రధాని నరేంద్ర మోడీ తనను కోరినప్పుడు సుజనా చౌదరి పేరును సిఫార్సు చేశానని తెలిపారు.
కేంద్ర మంత్రి మండలిలో ఒక సహాయ మంత్రి పదవి ఇస్తామని ప్రధాని తనకు చెప్పారన్నారు. దీంతో సుజన పేరును సిఫార్సు చేశానన్నారు. మూడో పదవి కావాలని కూడా కోరానని చెప్పారు. అది ఇస్తే తెలంగాణ టీడీపీ నేతకే అవకాశం కల్పిస్తామని చెప్పారు. కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారానికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఆయన ఆదివారం ఢిల్లీ బయలుదేరుతారు.
ఆదివారం ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా ప్రధాని మోడీ నుంచి బండారు దత్తాత్రేయకు ఆహ్వానం అందింది. శనివారం ఉదయం బోయిన్పల్లిలోని తాడ్బన్ హనుమాన్ ఆలయంలో పూజలు చేసిన దత్తాత్రేయ సాయంత్రం కుటుంబ సమేతంగా ఢిల్లీ చేరుకున్నారు. దత్తాత్రేయ 1998లోపట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మొదటిసారి కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టారు.

కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని దత్తాత్రేయ తెలిపారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే, తొలి ప్రాధాన్యం తెలంగాణకే ఇస్తానని చెప్పారు.
మోడీ పిలుపు నేపథ్యంలో దత్తన్న ఢిల్లీ బయలుదేరే ముందు ఆయనను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మోడీ కేబినెట్లో స్థానం కల్పించారంటూ దత్తాత్రేయ కృతజ్ఞతలు తెలిపారు.
స్వచ్ఛమైన సుపరిపాలన, అభివృద్ధికి పెద్దపీట వేసే మోదీ సర్కారులో మంత్రిగా బాధ్యతలు చేపట్టనుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో చోటు దక్కించుకున్న తాను ఇప్పుడు సూపర్ మోడీ ప్రభుత్వంలో కూడా మంత్రిగా సేవలు అందించనుండటం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలను మోడీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. అవసరమైతే రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడతానన్నారు.












Click it and Unblock the Notifications