చంద్రబాబు వర్సెస్ కెసిఆర్: అమరావతి వర్సెస్ బుద్ధవనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అనే పేరు ఖాయం చేయడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా అందరి మనసులను గెలుచుకున్నారు. గుంటూరు జిల్లాలోని అమరావతి ప్రసిద్ధమైన చారిత్ర ప్రదేశం. ఆంధ్రులందరినీ ఏకం చేయడానికి అది ఓ సెంటిమెంటుగా పనికి వస్తుంది. దానికి చారిత్రిక, ఆధ్యాత్మిక, పౌరాణిక ప్రాముఖ్యం ఉంది. అది ఒకప్పుడు శాతవాహనుల రాజధాని కూడా.
అమరావతి పేరును ఖాయం చేయడంలో మరో కీలకమైన అంశం కూడా ఇమిడి ఉంది. బౌద్ధం శ్రీలంక వంటి ఆగ్నేయ దేశాల్లో ఇప్పటికీ ప్రబలంగా ఉంది. అమరావతి ఆ దేశాల ప్రజలకు అత్యంత పవిత్రమైంది. అమరావతి పేరు వల్ల ఎపి రాజధాని ఓ పర్యాటక కేంద్రంగా కూడా మరింత ప్రఖ్యాతంలోకి రానుంది. బౌద్ధ మతం ప్రబలంగా ఉన్న దేశాల నుంచి దాని అభివృద్ధికి నిధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. ఈ దృష్ట్యా దాన్ని అభివృద్ధి చేయడం చంద్రబాబుకు మరింత సులభమవుతుంది.
హిందువులకు కూడా అ నగరం పవిత్రమైందే. దాన్ని అమరేశ్వరం అని కూడా పిలుస్తారు. పంచారామాల్లో ఇదొకటి. శివుడికి సంబంధించి ప్రసిద్ధమైన అమరేశ్వరాలయం ఉంది. బౌద్ధం విస్తరణకు కృష్ణా, గోదావరి తీరాలు అత్యంత ప్రాధాన్యం వహించాయి. 200బిసిలో అశోకుడు స్థాపించిన బౌద్ధ స్థూపం అక్డ ఉంది. కృష్ణా నది ఒడ్డును ఉండే అమరావతి ప్రపంచవ్యాప్తంగా తెలిసిన పేరు. అమరావతి అనే పేరును రాజధానికి ఖరారు చేయడం ద్వారా చంద్రబాబు ప్రజల మనసులను గెలుచుకున్నారని చెప్పవచ్చు.

కాగా, మరో వైపు కృష్ణానదిలో ఓ దీవిగా ఉండే నాగార్జున కొండ కూడా అత్యంత ప్రసిద్ధమైంది. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. చంద్రబాబు దీనికి కూడా ఏ విధమైన ప్రాధాన్యం ఇస్తారో తెలియదు. అయితే, తెలంగాణ రాష్ట్రంలోకి బుద్ధవనం వచ్చింది. ఆ బుద్ధవనాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని కెసిఆర్ చెప్పారు. దాంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ద్వారా బుద్ధవనం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లిన నాగార్జున కొండకు శ్రీపర్వతమనే పేరు కూడా ఉంది. నాగార్జున కొండ కూడా బౌద్ధానికి ప్రసిద్ధి. ఇక్కడు ఆచార్య నాగార్జునుడు చాలా ఉన్నాడని ప్రఖ్యాతి. అమరావతికి పశ్చిమాన ఇది 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని కూడా అభివృద్ధి చేయడానికి చంద్రబాబుకు అవకాశం ఉంది.
నాగార్జున కొండ 2వ శతాబ్దిలో బౌద్ధ విశ్వవిద్యాలయాలకు, బౌద్ధ సన్యాసుల అశ్రమాలకు నిలయంగా ఉండేది. నాగార్జునుడు మహాయాన బౌద్ధాన్ని ప్రచారం చేశాడు. ఇక్కడి విశ్వవిద్యాలయాలకు చైనా, గాంధార, బెంగాల్, శ్రీలంక దేశాల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి వచ్చేవారు. ఇక్ష్వాకులకు రాజధానిగా కూడా ఇది భాసిల్లింది. దీన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు అత్యంత ప్రధానమైన బౌద్ధ పర్యాటక కేంద్రంగా మారుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బుద్ధవనాన్ని అభివృద్ధి చేస్తానని కెసిఆర్ చెప్పారు. పైగా, ప్రభుత్వం దాని అభివృద్ధికి పూనుకుంటే బౌద్ధం ప్రధానంగా ఉన్న దేశాల నుంచి ఆర్థిక వనరులు సమకూరే అవకాశం ఉందని అంటున్నారు. చంద్రబాబు నాగార్జున కొండ అభివృద్ధిని కూడా తన ఎజెండాలోకి తీసుకుంటే బుద్ధవనం ప్రాధాన్యం తగ్గుతుందా అనేది తెలియదు
ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంతో పాటు ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలుగా మారడానికి అటు అమరావతితో పాటు ఇటు బుద్ధవనానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కెసిఆర్, చంద్రబాబు తప్పకుండా పోటీ పడాల్సిందే.












Click it and Unblock the Notifications