మంత్రిగా అశోక్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్పై బాబు పట్టు
హైదరాబాద్: హైదరాబాదులో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మార్చేందుకు ప్రయత్నిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడులో బుధవారం అన్నారు. గండిపేటలో రెండో రోజు మహానాడు కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పలు అంశాల పైన మాట్లాడారు. శంషాబాద్ విమానాశ్రయం పైన కూడా మాట్లాడారు.
శంషాబాద్లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తాము ఎన్టీఆర్ పేరు పెడితే.. కాంగ్రెసు ప్రభుత్వం దానిని మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టిందని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్రంలో తాము మద్దతిచ్చిన ప్రభుత్వమే అధికారంలో ఉందని, పైగా పౌరవిమానయాన శాఖ మంత్రిగా పార్టీకి చెందిన అశోక గజపతి రాజు ఉన్నారని, ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి పాత పేరును తీసుకు వస్తామని చెప్పారు.
దేశంలోని నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. వివిధ దేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలని కోరారు. ఎన్నికల సంస్కరణలు తీసుకువచ్చి అవినీతిని అంతమొందించడమే ధ్యేయంగా పని చేస్తామని తెలిపారు. పార్టీకి విరాళాలు ఇచ్చిన కార్యకర్తల పేర్లను చంద్రబాబు వేదికపై చదివి వినిపించారు.
ఏడు మండలాలు కలుపొద్దు: వినోద్
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపొద్దని కోరుతూ తెరాస ఎంపీ వినోద్ ఢిల్లీలో హోంశాఖ ప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. ఆ మండలాలను ఆంధ్రాలో కలపాలని కేంద్రంపై టిడిపి ఒత్తిడి తెస్తోందని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అందుకే హోంశాఖ ప్రతినిధులను కలిసినట్టు చెప్పారు. తెలుగుదేశం కుట్రలను అడ్డుకుంటామన్నారు.