అప్పటి దాకా బెజవాడలో తాత్కాలిక రాజధాని: బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఏర్పడే వరకు తాత్కాలిక రాజధాని ఒకటి ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని సలహా కమిటీతో ఆయన ఆయన మంగళవారంనాడు సమావేశమయ్యారు. ఎపి రాజధాని నిర్మాణం ప్రపంచ స్థాయికి దీటుగా ఉండాలని ఆయన అన్నారు. తాత్కాలిక రాజధానిని విజయవాడలో ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక రాజధాని నిర్వహణకు అవసరమైన వసతులను తెలుసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
విజయవాడ కేంద్రంగా పాలన సాగిస్తే అన్ని ప్రాంతాల ప్రజలకు, నాయకులకు అందుబాటులో ఉండవచ్చునని ఆయన భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆయన భావిస్తున్నారు. ఏదైనా నగరానికి సమీపంలో శాశ్వత రాజధానిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. డిమాండ్ల మాట ఎలా ఉన్నా రాష్ట్రానికి మధ్యలో ఉండే విధంగా శాశ్వత రాజధాని ఏర్పాటు కావాలని చంద్రబాబు అనుకుంటున్నారు.
ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ఉండాలని అన్నారు. ఈ రకంగా ఆయన ఏపీ రాజధాని నిర్మాణంపై చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి కసరత్తు ప్రారంభించారు. రాజధాని నిర్మాణంపై రాజధాని సలహా కమిటీ సభ్యులు చంద్రబాబుతో చర్చించారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఈ నెల చివరిలోగా కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. నివేదిక అనంతరం రాజధానిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

కాగా, రాష్ట్ర రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమలో ఆందోళన ఊపందుకుంటోంది. శ్రీబాగ్ ఒడంబడిక మేరకు కర్నూలునే రాజధానిగా చేయాలని రాయలసీమకు చెందినవారు డిమాండ్ చేస్తున్నారు. దాని సాధన కోసం వారు రాజధాని సాధన సమితి అనే సంస్థను ఏర్పాటు చేశారు.
కాగా, చంద్రబాబు ఆలోచన మాత్రం విజయవాడ - గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలనే దిశగా సాగుతున్నట్లు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలోని దొనకొండ కూడా ఆయన మనసులో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన తాత్కాలిక రాజధానిగా విజయవాడను మార్చుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications