స్వచ్ఛందంగా వైదొలగండి, లేదంటే....: చంద్రబాబు వార్నింగ్
ఒంగోలు/ విజయవాడ: కాల్వలను ఆక్రమించుకున్నవారు నెలరోజుల్లోగా స్వచ్ఛందంగా వైదొలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలోని సింగరాయన కొండ మండలంలో శనివారం ఆయన పర్యటించారు.మండలంలోని కనుమళ్ల గ్రామంలోని చిన్నచెరువులో మట్టి-నీరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
సింగరాయనకొండ మండలంలో చాలామంది ప్రభుత్వ కాల్వలను ఆక్రమించుకున్నారని, వారు వైదొలగడానికి నెలరోజుల గడువు ఇస్తున్నామని చెప్పారు. గడువులోపు వైదొలగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు.
జిల్లాలో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదైందని, అతికష్టమ్మీద తాగునీటి చెరువులు నింపామని చంద్రబాబు చెప్పారు. కోతలు లేకుండా కరెంట్ ఇవ్వగలుగుతున్నామని, వ్యవసాయానికి ఏడు గంటలు, గృహావసరాలకు 24గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత టీడీపీదేనని సీఎం చంద్రబాబు అన్నారు.
వ్యవసాయం లాభసాటిగా మారాలని బాబు కాంక్షించారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ఘనత టీడీపీ ప్రభుత్వానిదే ఆయన అన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, వచ్చేఏడాదికల్లా వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాకు నీళ్లు అందిస్తామన్నారు.
చెక్డ్యాంలు కట్టి నీటిని నిల్వ చేయాలని, భూగర్భ జలాలు పెంచే మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు సూచించారు. అదేవిధంగా గొలుసు చెరువులకు మరమ్మతులు చేసుకోవాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ మనందరి కల అని, ఎన్నికష్టాలొచ్చినా పోలవరం పూర్తి చేసి తీరుతామని చెప్పారు
కనుమళ్ల చెరువు వద్ద ఏర్పాటు చేసిన నీరు-చెట్టు పనులను మంత్రులు శిద్దా రాఘవరావు, దేవినేని ఉమా, రావెల కిశోర్బాబుతో కలిసి ప్రారంభించారు. సీఎం స్వయంగా పొక్లెయిన్ నడిపి పనులు ప్రారంభించారు. అనంతరం పంట సంజీవిని పనులను పరిశీలించారు. రూ.13కోట్లతో నిర్మించిన ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.90లక్షలతో ఏర్పాటు చేసిన పండ్ల నిల్వ కేంద్రం, ఉపాధి హామీ పథకం కింద రూ.12లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లను సీఎం ప్రారంభించారు.
ఇదిలావుంటే, రాజకీయ నాయకులు, కార్యకర్తల జీవితంలో సేవాభావం భాగం కావాలని చంద్రబాబు సూచించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ బాధ్యులతో చంద్రబాబు విజయవాడ నుంచి శనివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వాణిజ్య దృక్పథంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టలేదని, రాజకీయాల్లో సేవాభావం పెంచేందుకే పార్టీని నెలకొల్పారని స్పష్టం చేశారు. సమాజం మనకెంతో ఇచ్చిందని అటువంటి సమాజ రుణం తీర్చుకోవాలన్న ఎన్టీఆర్ ప్రబోధం అనుసరణీయమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఉత్తరాఖండ్ వరద బాధితులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చామని, గల్ఫ్ బాధితులకు అండగా నిలవడంతో పాటు కర్నూలు వరద బాధితులను ఆదుకున్న సందర్భాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
ఎండ తీవ్రత దృష్ట్యా అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. ఒక ఎన్జీవో సేవ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుందని, ఓ రాజకీయ పార్టీ సేవ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందనే సత్యాన్ని టిడిపి నాయకులు, కార్యకర్తలు గుర్తించాలని చంద్రబాబు అన్నారు.