ఏపీలో కరోనా: 14రోజుల్లో విస్పోటనం.. చంద్రబాబు తీవ్ర హెచ్చరిక.. స్పందించిన జగన్ సర్కారు..
దేశంలో కరోనా వైరస్ ప్రభావం అతి తీవ్రంగా ఉన్న టాప్-8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా కొనసాగుతున్నది. బుధవారం నాటికి కొత్తగా 60 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణకాగా మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 1800కు చేరువైంది. ఇప్పటికే 36 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్లోకి రాకముందే మద్యానికి గేట్లు ఎత్తేయడంతో వైన్ షాపుల దగ్గర రద్దీ ఏర్పడింది. మందుబాబుల కదలికలతో రాష్ట్రం పెను ప్రమాదంలో చిక్కుకున్నట్లయిందని ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నారు. అంతేకాదు, భవిష్యత్తుకు సంబంధించి ఆయన తీవ్రహెచ్చరికలు చేశారు.

14 రోజుల్లో మరిన్ని..
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఏపీలో మంగళవారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. రెండోరోజైన బుధవారం కూడా విక్రయాలు జోరుగా సాగాయి. అయితే చాలా చోట్ల ఫిజికల్ డిస్టెన్స్ సూత్రాన్ని పాటించకపోవడంతో వైరస్ వ్యాపించే ప్రమాదముందని చంద్రబాబు అంచనా వేశారు. రాబోయే 14 రోజుల్లో ఎప్పుడైనా వైరస్ విస్పోటనం జరగొచ్చని, భారీ సంఖ్యలో కొవిడ్-19 కేసులు బయటపడొచ్చని హెచ్చరించారు. మద్యం అమ్మకాల విషయంలో జగన్ సర్కారు అనుసరిస్తున్న తీరును ఆయన తూర్పారపట్టారు.

అందుకే ఈ విచ్చలవిడితనం..
కరోనా వైరస్ వ్యాప్తి, వైన్ షాపుల పున:ప్రారంభంతో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలను పార్టీ వెల్లడించింది. జే(జగన్) ట్యాక్స్లు వసూలుచేస్తూ కొన్ని సంస్థల ద్వారా తయారుచేయించిన అక్రమ మద్యాన్ని అమ్ముకునేందుకే ఏపీలో వైన్ షాపులు తెరిచారని, వాడకం తగ్గించడానికే ధరలు చెంచామని ప్రభుత్వం చెబుతోన్న మాట పచ్చి అబద్ధమని, ప్రజల జీవితాలతో సీఎం జగన్ ఆటలాడుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.

సీఎస్కు లేఖ..
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీ కూలీలను తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారని టీడీపీ తెలిపింది. కర్నాటకలో చిక్కుకుపోయిన ఏపీ కూలీలకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలంటూ ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్పకు లేఖ రాసిన చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి కూడా మరో లేఖ రాశారు. వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని వెంటనే స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని బాబు కోరారు.
Recommended Video

సవాళ్లకు సిద్ధమన్న సర్కారు..
రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలపై వైసీపీ సర్కారుకు పూర్తి అవగాహన, అంచనాలు ఉన్నాయని ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని చెప్పారు. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టెస్టులు ఎక్కువగా నిర్వహిస్తున్నందుకే కేసులు బయట పడుతున్నాయని, ఆ మేరకు క్వారంటైన్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచామని, రాబోయే రోజుల్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలసకూలీలు, ప్రయాణికులకు కరోనా టెస్టులు, క్వారంటైన్ల విధింపుపై ఒకటిరెండురోజుల్లో విధివిధానాలు వెల్లడిస్తామని మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications