పదేళ్లకు నవ్విన బాబు! జగన్ బేజారు, కారు జోరు
న్యూఢిల్లీ: సీమాంధ్రలో తెలుగుదేశం, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు దూసుకెళ్తున్నాయి. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టిడిపికి పోటీ ఇచ్చినప్పటికీ సైకిల్ హవా కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. సీమాంధ్రలోని పార్టీ కార్యాలయాల్లో, హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 63, టిడిపి 105, బిజెపి 4 స్థానాల్లో ముందంజలో ఉంది. లోకసభ స్థానాల విషయానికి వస్తే టిడిపి 13, బిజెపి 3, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 9 స్థానాల్లో ముందంజలో ఉంది.
తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెరాస 66, కాంగ్రెసు 22, టిడిపి, బిజెపి కూటమి 22, మజ్లిస్ 6 స్థానాల్లో ముందంజలో ఉంది. లోకసభ విషయానికి వస్తే తెరాస 11, కాంగ్రెస్ 2, బిజెపి, టిడిపి కూటమి 2, మజ్లిస్ 1, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 1 స్థానంలో ముందంజలో ఉంది.