ఎన్నికల వేళ చంద్రబాబు పుస్తకం మహాస్వాప్నికుడు' సంచలనం; హైలైట్స్ ఇవే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ సారి జగన్ ను గద్దె దించడం లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు పొత్తులతో ఎన్నికలకు వెళుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలలో చంద్రబాబు మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్న వేళ టిడిపి అధినేత చంద్రబాబు జీవిత విశేషాలతో "మహా స్వాప్నికుడు" పుస్తకాన్ని ఆవిష్కరించి, ఈ పుస్తకాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది టిడిపి. చంద్రబాబు జీవితవిశేషాలతో పాటు, ఆయన దూరదృష్టి, పాలన వంటి కీలక అంశాలపై సీనియర్ జర్నలిస్టు పూల విక్రమ్ రచించిన 'మహా స్వాప్నికుడు' పుస్తకాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ ఆవిష్కరించారు.

ఈ పుస్తకాన్ని 50 లక్షల రూపాయల ఖర్చుతో కువైట్ లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్ కోడూరి ప్రచురించారు. ఇక ఈ పుస్తకంలో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, సీఎంగా ఆయన పాలన తీరు, రాజకీయంగా ఆయన ఎదిగిన తీరు, చంద్రబాబు వ్యక్తిగత జీవితంతో పాటు, భవిష్యత్తు తరాల గురించి ఆయన ఆలోచించిన తీరు పైన క్షుణ్ణంగా వివరించారు.
చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసంతో మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏ విధంగా తీర్చిదిద్దాలని భావించాడు అనే అంశాలను పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను, తప్పుడు కేసులు పెట్టి ఆయనను జైలుకు పంపిన పరిస్థితులను, అయినప్పటికీ మొక్కవోని దీక్షతో చంద్రబాబు సాగిస్తున్న పోరాటాన్ని వివరించారు.
ఈ పుస్తకంలో ప్రధానంగా రాజధాని అంశాన్ని హైలైట్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు చేసిన కృషిని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కలలు కన్న రాజధాని అమరావతి విధ్వంసాన్ని విశదీకరించి చెప్పారు. నవనగరాలు నిర్మాణం అయితే ఎలా ఉంటుంది అనే అంశాన్ని పూసగుచ్చినట్టు ఇందులో వివరించారు. జగన్ పాలనలో చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనపై అక్రమ కేసులు బనాయించి 53రోజులపాటు జైల్లో పెట్టిన వైసిపి తీరును ఎండగట్టారు.
చంద్రబాబు కోసం బయటకు వచ్చిన నారా కుటుంబం సాగిస్తున్న పోరాటాన్ని వివరించారు. చంద్రబాబుపై రాజకీయ ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారాలు.. అసలు వాస్తవాలు అంటూ ఈ పుస్తకంలో ఒక అధ్యాయాన్ని రాశారు. ఈ పుస్తకం చదివితే చంద్రబాబు రాష్ట్రం కోసం చేసిన, చేస్తున్న త్యాగాలు అర్థం అవుతాయని రచయిత పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications