చంద్రబాబు ‘రా కదలిరా’.. మళ్లీ ఈ నియోజకవర్గాల్లోనే మొదలు
అమరావతి: 'రా కదలిరా' సభల్లో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో అనకాపల్లి జిల్లా కే. కోటపాడు బయల్దేరతారు చంద్రబాబు.
ఉదయం 11.30 గంటలకు గొండుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన 'రా కదలిరా' సభా ప్రాంగంకు చేరుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్లో ఏలూరు జిల్లా చింతలపూడి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు చిత్తూరు జిల్లా వెళ్లనున్న చంద్రబాబు.. గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకుంటారు. రోడ్డు మార్గంలో ఉండవల్లి నివాసానికి వెళ్లనున్నారు.

ఇది ఇలావుండగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సన్నద్ధం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం తన నివాసంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, సభా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. మరోవైపు, జగన్ ఎన్నికల హామీల పేరుతో మోసాలకు పాల్పడ్డారంటూ 'ప్రజాకోర్టు' పేరుతో ఛార్జ్ షీట్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ చెబుతున్న 99 శాతం హామీల అమలు అనేది అతి పెద్ద బూటకం అని విమర్శించారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్ కు ప్రజాకోర్టులో శిక్ష పడటం ఖాయమన్నారు. అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీడీపీ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తోంది.












Click it and Unblock the Notifications