మోడీ! దమ్ముంటే చర్చకు రాః దీదీ సవాల్..మోడీ-షా శని వదులుతుందిః చంద్రబాబు
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని దేశం నుంచి తరిమి కొట్టాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా మోడీ-షా జోడీ విజయం సాధిస్తే.. ఇక దేశం అధోగతి పాలవుతుందని ఆమె హెచ్చరించారు. రాజ్యాంగాన్ని మార్చివేస్తారని, ఇక ఎన్నికలు అనేవే లేకుండా రాజ్యాంగంలో మార్పులు చేస్తారని అన్నారు. ఆదివారం సాయంత్రం విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు మమతా బెనర్జీ హాజరయ్యారు. ఆమెతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందులో పాల్గొన్నారు.
శతృవును ఎదుర్కొనడానికి విభేదాలు వీడాలిః
మనందరికి ఉమ్మడి శతృవైన మోడీ-షా జోడీని ఎదుర్కొనడానికి అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని మమతా చెప్పారు. రాష్ట్రాల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. ఉమ్మడి శతృవును ఓడించడానికి ఏకం కావాలని అన్నారు. మోడీ-షా జోడీ ప్రజాస్వామ్య మనుగడకు అత్యంత ప్రమాదకరమని అన్నారు. గత ఎన్నికల్లో చాయ్ వాలాగా మారిన మోడీ.. ఇప్పుడు చౌకీదారునిగా అవతారం ఎత్తారని, ప్రజలను మోసగిస్తున్నారని దీదీ ఆరోపించారు. దేశాన్ని దోచుకునే వారికి మోడీ కాపలాదారునిగా ఉన్నారని అన్నారు. రైతులను, జవాన్లను హతమార్చే కాపలాదారుడని మండిపడ్డారు. మోడీ హయాంలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయని అన్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అబద్ధాలు ఆడటంలో మోడీని మించిన వారు లేరని విమర్శించారు.
మోడీ వంటి నాయకుడు దేశానికి అవసరం లేదు..
దేశానికి మహాత్మాగాంధీ వంటి నాయకుల అవసరం ఉందని మమతా బెనర్జీ చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబూ రాజేంద్రప్రసాద్, భగత్ సింగ్ వంటి నాయకుల నేతృత్వం అవసరం ఉందని చెప్పారు. పుల్వామా దాడుల సమాచారం మోడీకి ముందే తెలుసని, ఓట్ల కోసం ఈ దాడులను ముందుగానే అడ్డుకోలేకపోయారని ధ్వజమెత్తారు. పుల్వామా దాడుల తరువాత అఖిల పార్టీ సమావేశం పెట్టలేదని గుర్తు చేవారు. బీజేపీ హయాంలో ఎప్పుడూ దేశంలో మత కల్లోలాలు, ఉగ్రవాదుల దాడులు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. జవాన్లు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారని, వారి మరణాన్ని కూడా ఓట్ల కోసం వాడుకుంటున్నారని మమతా విమర్శించారు.
ప్రధాని ఎవరనేది నిర్ణయించేది తామే..
లోక్ సభ ఎన్నికల తరువాత ప్రధాని అభ్యర్థి ఎవరని నిర్ణయించేది తామేనని మమతా బెనర్జీ చెప్పారు. ప్రజల అవసరాలు తమకు బాగా తెలుసని, వారి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రధానమంత్రిని నిర్ణయిస్తామని చెప్పారు. దేశంలో నెలకొన్న సంక్షోభకర పరిస్థితులపై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని మమతా సవాలు విసిరారు. అవసరమైతే బీజేపీకి చానల్ లోనే డిబేట్ చేద్దామని అన్నారు. ఎవరి వద్ద ఎంత శక్తి ఉందో తేల్చుకుందామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 125 సీట్లు గెలిస్తే.. గొప్ప విషయమని అన్నారు. దేశం బాగు పడాలంటే.. మోడీ, మోడీకి మద్దతు ఇచ్చే వారిని తరిమి కొట్టండని అన్నారు.
ఏం తమ్ముళ్లూ! మీకు రోషం లేదా? పౌరుషం లేదా? కేసీఆర్ తొత్తులకు ఓటేస్తారా? : చంద్రబాబు
పాకిస్తాన్ కలను మోడీ-షా జోడి చేశారు..
స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేనివిధంగా దేశంలో అత్యంత దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని కేజ్రీవాల్ చెప్పారు. నోట్ల రద్దు.. అతి పెద్ద కుంభకోణమని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టారని సోదర భావాన్ని నాశనం చేశారని కేజ్రీవాల్ విమర్శించారు. హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించారని అన్నారు. భారత దేశాన్ని కులాలు, ప్రాంతాలు, మతాలవారీగా విడగొట్టాలనేది పాకిస్తాన్ కల అని, దాన్ని అయిదేళ్లలోనే మోడీ-షా జోడీ నిజం చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ సారి ఎన్నికల్లో వారిద్దరూ గెలిచారంటే దేశం మిగలదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పాతేస్తారని హెచ్చరించారు. 2019లో మోడీ-షాలకు ఓటు వేస్తే.. ఇక దేశంలో ఎన్నికలే జరగవని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ చెప్పారని గుర్తుచేశారు.
శని వదులుతుందిః
రాష్ట్రాభివృద్ధిని మోడీ అడుగడుగునా అడ్డుపడ్డారని చంద్రబాబు అన్నారు. మోడీకి ప్రధాని స్థాయి లేదని అన్నారు. విశాఖలో ఎయిర్ షో పెడితే, అడ్డుకున్నారని, చవకబారుతనంతో ప్రవర్తించారని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక సహాయ నిధి 350 కోట్లు వచ్చిన తరువాత.. వెనక్కి తీసుకునే, నీచమైన మనస్తత్వం మోడీదని అన్నారు. మోడీకి ఓటు అడిగే హక్కు లేదని చంద్రబాబు చెప్పారు. తెలుగు గడ్డ మీద కాలు పెట్టే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదని అన్నారు. మోడీకి ఫ్లయిట్ ఖర్చులు కూడా రావని చెప్పారు. మోడీ ఓడిపోతేనే దేశానికి లాభమని అన్నారు. పెద్దనోట్ల రద్దు ఎందుకు చేశారో మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తరువాత ప్రజలు మోడీని గుజరాత్కు పంపించడం ఖాయమని అన్నారు.