స్విస్ బంగారం ఇస్తామని బ్లాక్ పేపర్ బండిల్...
హైదరాబాద్: స్విట్జర్లాండ్ దేశానికి చెందిన బంగారాన్ని తక్కువ ధరకు ఇస్తామని వ్యాపారిని మోసం చేసి రూ.30 లక్షలతో ఉడాయించిన ఓ గ్యాంగ్ను హైదరాబాదులోని చాదర్ఘాట్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.30 లక్షల నగదు, రెండు కార్లు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంబర్పేట్ ఈస్ట్ డిసిపి ఆఫీస్లో శుక్రవారం డిసిపి షహనాజ్ ఖాసీం కేసు వివరాలను వెల్లడించారు.
కర్నూలు జిల్లా పాములపాడు (ఎండి) మండలం కృష్ణనగర్కు చెందిన టి. వెంకటరెడ్డి వద్దకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన సిహెచ్. వీరవెంకట సత్యనారాయణ అలియాస్ గోపిరెడ్డి అలియాస్ సత్తిబాబు (38) అనే వ్యక్తి వచ్చి తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పాడు. అయితే అతను నమ్మ లేదు.

మళ్లీ నెల కిందట నందికొట్కూరులో తిరిగి వెంకటరెడ్డికి గోపిరెడ్డి కలిసి తన వద్ద ఒకటిన్నర కిలోల విలువైన స్విట్జర్లాండ్ దేశానికి చెందిన బంగారం ఉందని రూ. 30 లక్షలు ఇస్తే బంగారం ఇస్తానని చెప్పాడు. ఈసారి గోపిరెడ్డి నిజమైన బంగారాన్ని చూపించాడు. అయితే, నగరంలోని మలక్పేటలో ఉన్న భవానీ లాడ్జీకి సదరు డబ్బులను ఈ నెల 23వ తేదీన తీసుకొస్తే బంగారం ఇస్తానన్నాడు.
చెప్పినట్లుగానే వెంకటరెడ్డి డబ్బులతో లాడ్జీలోని 210 గదికి వచ్చాడు. అప్పటికే ఆ గదిలో ఉన్న గోపిరెడ్డి, నంద్యాలకు చెందిన అతని స్నేహితులు వేముల తిరుపతి అలియాస్ తిరుపతయ్య (52), తూర్పుగోదావరి జిల్లా అమలాపురం బట్టలపాలెంకు చెందిన నాతిన శ్రీను (25) వెంకట్ రెడ్డి తెచ్చిన డబ్బుల బ్యాగును తీసుకున్నారు.

డబ్బులను పరిశీలిస్తున్నట్లు నటించి నలుపురంగు బండిల్ ఉన్న మరో బ్యాగ్ను పెట్టి వెంకట్ రెడ్డికి అందించారు. ఆపై వెంకటరెడ్డి కళ్లు గప్పి బంగారాన్ని తీసుకుని వస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు గోపిరెడ్డిని నర్సాపురంలో, తిరుపతిని చైతన్యపురిలో, శ్రీనును అమలాపురంలో అరెస్టు చేసి నగరానికి తీసుకుని వచ్చారు.












Click it and Unblock the Notifications