పొద్దుపోయాకే తీయమన్నాడు: డబ్బా తీసి షాక్ తిన్న వివాహిత.. అంతా దగా?
నెల్లూరు: ఎంతటి సమస్య అయినా సరే ఒక్క పూజతో మాయం చేస్తామని చెప్పగానే చాలామంది ఇట్టే నమ్మేస్తుంటారు. తీరా పూజ ముగిసేసరికి తాము మోసపోయామని గ్రహించి గగ్గోలు పెడుతుంటారు. ఎన్ని సంఘటనలు జరిగినా.. ఇటువంటివి మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూనే ఉంటాయి.
తాజాగా నెల్లూరు జిల్లా పొదలకూరు శ్రీనివాసాపురం వీధిలో విజయలక్ష్మి అనే వివాహిత ఇలాగే మోసపోయింది. శనివారం రోజు పూసలు, సవరాలు అమ్మతామంటూ ఇద్దరు మహిళలు శ్రీనివాసపురం వీధిలో తిరుగుతూ ఆమెకు కనిపించారు. దీంతో విజయలక్ష్మితో మాటలు కలిపిన ఆ ఇద్దరు.. మీ ఇంట్లో కీడు ఉందని చెప్పారు.
ఇంట్లో కీడు ఉంటే ఒంట్లో అలసటగా, చికాకుగా ఉంటుందని, శాంతి పూజ చేయించుకుంటే అంతా నయం అవుతుందని నమ్మబలికారు. ఆ తర్వాత విజయలక్ష్మి ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి.. ఇంటిని క్షుద్రశక్తులు ఆవహించాయని, పూజ చేయాలని చెప్పాడు. దీంతో విజయలక్ష్మి సరేనంది.
పూజ సమయంలో బంగారు ఆభరణాలు పెడితే ఫలితం బాగుంటుందని విజయలక్ష్మిని నమ్మించాడు. వెంటనే ఇంట్లో నుంచి మూడు సవర్ల బంగారం తీసుకొచ్చి పూజలో పెట్టింది.
ఓ ప్లాస్టిక్ డబ్బాలో దాన్ని ఉంచి పూజ చేసిన వ్యక్తి.. సాయంత్రం బాగా పొద్దుపోయేంత వరకు దాన్ని తీయవద్దన్నాడు. ఆ తర్వాతే ఆ డబ్బాను తెరిచి ధరించాలన్నాడు. అతను చెప్పినట్లే చేసిన విజయలక్ష్మి షాక్ తిన్నది. తీరా డబ్బా తెరిచేసరికే అందులో గొలుసు లేకపోవడంతో లబోదిబోమన్నది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.