తిరుపతి అలా దాటగానే చెన్నై వచ్చేస్తోంది!!
తమిళనాడు రాజధాని చెన్నై రూపురేఖలు మార్చుకోబోతోంది. ఈ నగరాన్ని భారీగా విస్తరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఎండీఏ) పరిధి 1,189 చ.కి.మీ. ఉండగా దాన్ని 5,904 చ.కి.మీ.కు పెంచుతూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో ఏపీ సరిహద్దు జిల్లాలైన చిత్తూరు, తిరుపతి దాటగానే చెన్నై ప్రారంభం కాబోతోంది.

తెలుగు నియోజకవర్గాలు ఉత్తర చెన్నై పరిధిలోకి..
సీఎండీఏ ప్రాంతాన్ని విస్తరించడంతో ప్రధానంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలు, వాటి చుట్టుపక్కలున్న ప్రాంతాలకు ఉపాధి వనరులు పెరుగుతాయి. అంతేకాకుండా నెల్లూరు జిల్లా నుంచి భారీ సంఖ్యలో ఉత్పత్తులు చెన్నైకి వస్తున్నాయి. నగర పరిధిని విస్తరించడంతో ఏపీ సరిహద్దులో ఎటువంటి సెక్టార్లు వస్తాయనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. తెలుగువారు ఎక్కువగా నివసించే తమిళ నియోజకవర్గాలు.. తిరువళ్లూరు, ఉత్తుకోట, శ్రీపెరంబుదూరు, పొన్నేరి నియోజకవర్గాలను ఉత్తర చెన్నై పరిధిలోకి తీసుకువచ్చారు.

నగర పరిది 5904 కిలోమీటర్లు
ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ మార్పు ప్రక్రియ చేపట్టారు. 2023లో దీన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఏపీకి ఆనుకొని ఉండే రాణిపేట, తిరువళ్లూరు జిల్లాలు పూర్తిగా చెన్నై పరిధిలోకి వచ్చాయి. మొత్తంగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు చెన్నైలో కలవబోతున్నాయి. అంతే కాకుండా 1125 గ్రామాల్ని కూడా చెన్నై పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధి 7257 చదరపు కిలోమీటర్లు. దీన్ని మించి రూపొందించాలనుకున్నప్పటికీ ప్రజల నుంచి వచ్చిన వినతులు, నిపుణుల సహాలు పరిగణనలోకి తీసుకొని 5904 చదరపు కిలోమీటర్లకు పరిమితం చేశారు.

సరికొత్త విమానాశ్రయం
కాంచీపురం జిల్లాలోని పరందూరుతో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారు. చెన్నై మీనంబాకంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో రాబోయే 30 సంవత్సరాల అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని నిర్మించబోతున్నారు.13 గ్రామాల్లో 4563 ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. భూసేకరణపై మార్కెట్ విలువకన్నా 3.5 రెట్లు ఎక్కువ పరిహారాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకుంది. చెన్నైని ఎయిర్ లైన్స్ హబ్ గా తీర్చిదిద్దాలని అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications