బాబు పక్క రాష్ట్రంలో పట్టుబడ్డ దొంగ: చెవిరెడ్డి, 'ఓటుకు నోటుపై చర్చ ఎందుకు వద్దో చెప్పండి'
హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ అని ఆయనను చెవిరెడ్డి అభివర్ణించారు. శాసనసభ వాయిదా పడిన సమయంలో అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
ఓటుకు నోటు కేసులో సొంత రాష్ట్రంలో తప్పించుకుని పక్క రాష్ట్రంలో చంద్రబాబు పట్టుబడ్డారని ఆరోపించారు. దీంతో ఏపీ పరువును పొరుగు రాష్ట్రంలో నిలువునా ముంచారని, ఏపీ భవిష్యత్తును ప్రధాని వద్ద తాకట్టు పెట్టారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
టీడీపీ నేతలకు దమ్ముంటే ఓటుకు నోటు కేసుపై చర్చకు రావాలని కూడా ఆయన సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని చెవిరెడ్డి ఆరోపించారు.
ఓటుకు నోటు మీద ప్రపంచం అంతా ప్రచారం: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఓటుకు నోటు కేసుపై ప్రభుత్వం ఎందుకు చర్చకు వెనుకాడుతందో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఓటుకు నోటు కేసుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరిగిందన్నారు. అన్ని పత్రికల్లో కూడా వార్తలొచ్చాయని స్పష్టం చేశారు.
చంద్రబాబు దొంగతనం బయటపడిందని, అయినా తెలుగుదేశం పార్టీ మంత్రులకు ఉలుకెందుకో అర్థం కావటం లేదన్నారు. ఏదైనా అడగండి కానీ, ఓటుకు నోటు అంశంపై మాత్రం చర్చ వద్దంటున్నారని అన్నారు. నిజంగానే ఆ కేసులో చంద్రబాబు ప్రమేయం లేకపోతే చర్చకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రశ్నించారు.
ఏదైనా అడిగితే, ప్రతిపక్షాన్ని మీ కథ తేలుస్తాం... జాగ్రత్తగా ఉండండి అని బెదిరిస్తున్నారన్నారు. పెద్ద పెద్ద చూపులు చూస్తున్నారు. ఏం చేస్తారండి. గోదావరికి తీసుకు వెళ్లి నీళ్లలో ముంచేస్తారా? గుంటూరు ఆస్పత్రిలో చేర్చి ఎలుకలతో కరిపిస్తారా? లేదంటే నారాయణ కాలేజీలో చేర్పించి ర్యాగింగ్ చేయిస్తారా? ఎమ్మార్వో వనజాక్షిని కొట్టినట్లు రౌడీలతో మమ్మల్ని కొట్టిస్తారా? పోనీ ఏలూరు తీసుకువెళ్లి ఇంజక్షన్ చేయించి చంపిస్తారా? అంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు.
ఇదేమి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదని, అసెంబ్లీ. మేం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలమని చెప్పిన ఆయన వైయస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిగా వైయస్ జగన్ నేతృత్వంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం సాగిస్తామన్నారు.