ఏపీలో భారీగా పెరిగిన చికెన్ ధర
ఏపీలో చికెన్ ధర భారీగా పెరిగింది. గత నెలలో కేజీ చికెన్ రూ.230 నుంచి రూ.250 మధ్యలో ఉండేది. అయితే గత మూడు వారాల నుంచి చికెన్ ధర భారీగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేజీ రూ.300గా ఉంది. భవిష్యత్తులో ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీనికితోడు కోడిగుడ్డు ధరలు కూడా కొండెక్కాయి. మార్చిలో 100 గుడ్లు రూ.425గా ఉంటే ఏప్రిల్ నెలలో రూ.20 తగ్గింది. ఇప్పుడు మాత్రం హఠాత్తుగా పెరిగాయి. 100 గుడ్ల ధర రూ.550గా ఉంది. డజను రూ.72 చొప్పున రిటైల్ వ్యాపారస్తులు అమ్ముతున్నారు.
ఎండలకు మరణించిన కోళ్లు
మార్చి, ఏప్రిల నెలల మధ్యకాలంలో తీవ్ర వడగాడ్పులు వీయడంతోపాటు ఎండలు మండించాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఇంత వేడిలో కోళ్లు భారీసంఖ్యలో మరణించాయి. ఆ నెలలో కేజీ చికెన్ రూ.230 నుంచి రూ.250, రూ.260 మధ్య నడిచింది. కోళ్లు మరణిస్తుండటంతో పౌల్డ్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. ఆ ప్రభావమే చికెన్ ధర పెరగడానికి కారణమైంది.

కొత్త బ్యాచ్లు వస్తేనే..
ఏడు నుంచి తొమ్మిది వారాలకు కోడి పిల్లలు సిద్ధమవుతాయి. దీంతో ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచ్ లు రాలేదు. డిమాండ్ పెరగడం.. మార్కెట్ లో సరఫరా లేకపోవడం చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. 20 రోజుల వ్యవధిలోనే కేజీకి రూ.40 నుంచి రూ.60 మధ్యలో తేడా వచ్చింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతోపాటు వాతావరణం చల్లగా ఉండటంతో పౌల్డ్రీ రైతులు కొత్త బ్యాచ్ లను తెస్తున్నారు. ఇవి మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాతే ధరలు తగ్గుతాయి. అప్పటివరకు చికెన్ ధర మండిస్తూనే ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో కర్రీ పాయింట్లు, బిర్యానీ పాయింట్లలో గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతిరోజు 20 కిలోల చొప్పున అమ్మే వ్యాపారులు ప్రస్తుతం 10 కిలోలతోనే సరిపెడుతున్నారు.












Click it and Unblock the Notifications