అదెక్కడ? మీరే రాస్తున్నారు: రాయల టిపై చిద్దూ ట్విస్ట్
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాయల తెలంగాణనా, అదెక్కడుంది? అని కేంద్రమంత్రి చిదంబరం ట్విస్ట్ ఇచ్చారు. మంత్రుల బృందం (జివోఎం) తెలంగాణ, రాయల తెలంగాణలతో రెండు ప్రతిపాదనలను చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గురువారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కోర్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో తెలంగాణ బిల్లు, శీతాకాల సమావేశాలు తదితర అంశాలపై చర్చించారు.
భేటీ అనంతరం చిదంబరాన్ని మీడియా పలకరించింది. రాయల తెలంగాణ గురించి ప్రశ్నించింది. దానికి స్పందించిన చిదంబరం.. రాయల తెలంగాణానా, అదెక్కడుందని ఎదురు ప్రశ్నించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.
పది జిల్లాల తెలంగాణకే కేబినెట్ ఆమోదం తెలిపిందని అయితే మీరు 12 జిల్లాలు రాసుకుంటే తామేం చేయగలమని అన్నారు. రాయల తెలంగాణపై ప్రచార సాధనాల్లో వస్తున్న వార్తలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ కార్యాలయంలో దిగ్విజయ్ సింగ్తో జివోఎం సభ్యులు జైరామ్ రమేష్, నారాయణ స్వామిలు భేటీ అయ్యారు.
సమైక్యమే: శైలజానాథ్
తాము సమైక్యాంధ్ర ప్రదేశ్ తప్ప మరో ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తి లేదని మంత్రి సాకె శైలజానాథ్ హైదరాబాదులో అన్నారు. సమైక్యం వల్లనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. తాము అసెంబ్లీలో, పార్లమెంటులో విభజన బిల్లును అడ్డుకుంటామని చెప్పారు.
రాయల టినే: మధుసూదన్ గుప్తా
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి లేదా రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు మధుసూదన్ గుప్తా అన్నారు. విభజన రాయల తెలంగాణతోనే సాధ్యమన్నారు.
సోనియా మాట తప్పరు: శంకర రావు
తెలంగాణపై సోనియా గాంధీ మాట తప్పరని మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర రావు అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీదే విజయమన్నారు. సోనియా ఆదేశిస్తే తాను గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పైన పోటీ చేస్తానన్నారు.