అందరూ చూస్తుండగా పట్టపగలు యువకుడ్ని కొట్టి చంపారు
అందరూ చూస్తుండగా పట్టపగలు ఓ యువకుడి రౌడీ మూక కొట్టి చంపింది. జులాయిగా తిరుగుతూ జులం చెలాయిస్తున్న ముఠా ఈ దారుణానికి ఒడిగట్టింది.
విశాఖపట్నం: అందరూ చూస్తుండగా పట్టపగలు ఓ యువకుడి రౌడీ మూక కొట్టి చంపింది. జులాయిగా తిరుగుతూ జులం చెలాయిస్తున్న ముఠా ఈ దారుణానికి ఒడిగట్టింది. కాలేజీ మైదానంలో అంతర్ కళాశాల క్రీడాపోటీలు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
యువకుడ్ని తీవ్రంగా కొట్టి బైక్పై తీసుకుని వచ్చి అతన్ని రోడ్డుపై పడేశారు. తీవ్రంగా గాయపడిన 22 ఏళ్ల చిలకా దుర్గాప్రసాద్ ప్రాణాలు క్షణాల్లో అనంతవాయువుల్లో కలిశాయి. అతను గాందీ గ్రామం పంచాయతీ సిటిజన్ కాలనీకి చెందినవాడు.
భర్తను కోల్పోయి కుమారుడిపైనే ఆశలు పెట్టుకున్న దుర్గాప్రసాద్ తల్లి రోదనలు మిన్నంటాయి. ఆమె రోదనలు చూపరులను కదిలించి వేశాయి.
ఇలా జరిగింది...
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా అంతర్ కళాశాల క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను చూడడానికి దుర్గాప్రసాద్ వచ్చాడు. అతన్ని కొంత మంది యువకులు పక్కకు లాక్కెళ్లారు. ఆటలు చూస్తున్నవారు ఏం జరుగుతోంందో పట్టించుకోలేదు. ఒక్కసారిగా దుర్గాప్రసాద్పై వారు దాడి చేశారు.
వెంటపడి మరీ కొట్టారు...
వెంటపడి దుర్గాప్రసాద్ను వారు మరీ మరీ కొట్టారు. తీవ్ర గాయాలతో స్పృహ తప్పి పడిపోయిన అతన్ని దుండగులు బైక్పై రోడ్డు మీదికి తీసుకుని వచ్చి పడేసి వెళ్లిపోయారు. స్థానికులు అతన్ని వెంటనే ఆటోలో చోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
తల్లి కన్నీరు మున్నీరు...
సంఘటన గురించి తెలిసిన తల్లి, చెల్లె ఆస్పత్రి వద్దకు వచ్చారు. వారి రోదనలతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. ఎస్సై మల్లేశ్వర రావు ఆస్పత్రికి వద్దకు వచ్చి పరిశీలించారు. దుర్గాప్రసాద్ సొంతూరు వడ్డాది. తండ్రి మరణించిన తర్వాత పదేళ్ల క్రితం గాంధీ గ్రామం వచ్చాడు. అతను జీపు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిరాడు.
గాంధీ గ్రామానికి మృతదేహం...
భర్త చనిపోయిన తర్వాత దుర్గాప్రసాద్ తల్లి ఈశ్వరమ్మ కుమారుడిని, కూతురిని తీసుకుని గాంధీ గ్రామం వచ్చింది. చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ పిల్లలన చదివించింది. పదవ తరగతి వరకు చదివిన దుర్గాప్రసాద్ తల్లికి సహాయంగా ఉండడానికి చదువు మానేసి జీపు డ్రైవర్గా చేరి చెల్లెకు వివాహం చేశాడు. తల్లి ఈశ్వరమ్మ ప్రస్తుతం ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. దుర్గాప్రసాద్ ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు.
తొమ్మిది మందిపై కేసు
తన కుమారుడిపై తొమ్మిది మంది దాడి చేసినట్లు ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరు పుల్లేటి నరేంద్ర అలియాస్ కేటు, ప్రభాకర్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో మైనర్లు కూడా ఉన్నారు. డిఎస్పీ వెంకటరమణ మృతదేహాన్ని పరిశీలించారు.