ఆత్మస్థైర్యంతో ముందుకెళుతున్నారు: కెసిఆర్పై జీయర్స్వామి
వరంగల్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్స్వామి అన్నారు. హన్మకొండలో శుక్రవారం జరిగిన అర్చక సమాఖ్య మహాసభకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిన్న జీయర్స్వామి మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉదని అన్నారు. ప్రాచీన ఆలయాల పురోభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సిఎం కెసిఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తారన్న విశ్వాసం ఉందని జీయర్ స్వామి పేర్కొన్నారు.
బ్రాహ్మణులకు కెసిఆర్ వరాలు
రూ. 10 కోట్లతో హైదరాబాద్లో బ్రాహ్మణ భవన్ను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. హన్మకొండ కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన అర్చక మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. గత 20 ఏళ్లుగా చిన్న జీయర్స్వామి ఆశీస్సులు తనకున్నాయని తెలిపారు.

స్వామి వారి సూచనలను పాటిస్తామని చెప్పారు. మొట్టమొదట బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేసింది తానేనని అన్నారు. ధార్మిక భావన, సామాజిక కట్టుబాట్లు ఉన్న గొప్పనగరం వరంగల్ అని కొనియాడారు. గత ప్రభుత్వాలు ఆలయాలను ఏనాడు పట్టించుకోలేదనీ, ఆధ్యాత్మికతను, ధార్మిక భావనలను పరిరక్షించుకుంటనే శాంతి కలుగుతుందని తెలిపారు.
మురికివాడలను పరిశీలించిన కెసిఆర్
రాజకీయాలకు అతీతంగా పేదప్రజల అభివృద్ధికి పాటుపడుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం దీన్దయాళ్ నగర్లోని మురికివాడలను పరిశీలించారు. అనంతరం అక్కడి ప్రజలతో స్థానిక సమస్యలపై చర్చించారు. పలు సమస్యలను స్థానికులు సిఎం దృష్టికి తీసుకువచ్చారు.
వరంగల్, హన్మకొండలో 500 ఎకరాల్లో మురికి వాడలు ఉన్నాయనీ, దశలవారీగా మురికి వాడలన్నింటినీ అభివృద్ధి చేస్తామని కెసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు. మొదటగా దీన్దయాళ్ నగర్లోని మురికివాడలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాలనీలోని పేదవాళ్లందరికి నివాస ధృవీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. వాళ్లందరికీ ఇళ్ల పట్టాలు కూడా ఇస్తామని తెలిపారు.
శనివారం దీన్దయాళ్ బస్తీ వాసులంతా ఇంట్లోనే ఉండాలనీ.. ఉదయం నుంచి సాయంత్ర వరకు అధికారులు బస్తీలో సర్వే చేస్తారని చెప్పారు. రాత్రి వరకు పట్టాలు తయారుచేస్తారని తెలిపారు. భూపాలపల్లి నుంచి తిరిగివచ్చిన తర్వాత తానే స్వయంగా బస్తీవాసులకు పట్టాలు అందిస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications