Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం-ప్రస్ధానమిదే..!
ఏపీలో అధికార కూటమి స్పీకర్ గా నిలబెట్టిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు తరఫున ఇవాళ కూటమి నేతలు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
గడువు ముగిసేలోగా ఇతర నామినేషన్లేవీ రాకపోవడంతో అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు ప్రకటించారు. ఇవాళ ఉదయం అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. ఎన్టీఆర్ 1983లో పార్టీ స్థాపించి తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బీసీ నేత. 1983 నుంచి ఇప్పటివరకూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఆయన నర్సీపట్నం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో పలుమార్లు మంత్రిగా వ్యవహరించిన అనుభవం ఉంది. నర్సీపట్నం నుంచి మరోసారి గెలిచిన ఆయన్ను కేబినెట్లోకి తీసుకునే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు స్పీకర్ గా అవకాశం కల్పించారు.
ఇవే తనకు చివరి ఎన్నికలుగా ప్రకటించిన అయ్యన్నపాత్రుడు తనతో పాటు కుమారుడు చింతకాయల విజయ్ ని కూడా ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబు మాత్రం అయ్యన్నకు మాత్రమే ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. దీంతో అయిష్టంగానే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన అయ్యన్న మరోసారి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి ఆశించారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వలేకపోయిన చంద్రబాబు.. స్పీకర్ గా మాత్రం అవకాశం ఇచ్చారు. దీంతో అయ్యన్న సంతోషంగానే కనిపిస్తున్నారు.
స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషం గా ఉందని అయ్యన్నపాత్రుడు తెలిపారు. గతంలో ఎమ్మెల్యే గా, మంత్రిగా, ఎంపీ గా పని చేసానని, స్పీకర్ గా కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తు రాకూడదని అయ్యన్న పేర్కొన్నారు. గౌరవ విపక్ష సభ్యులకు కూడా అసెంబ్లీలో ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. వారికి కూడా అధికార పక్షంగా పాటు మాట్లాడేందుకు సమయం ఇస్తానని, నా పనితీరు మీరే చూస్తారన్నారు.












Click it and Unblock the Notifications