కొత్త పార్టీ అజెండా ఏమిటి: కిరణ్కు చిరంజీవి సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి మరోసారి ధ్వజమెత్తారు. కిరణ్ కొత్త పార్టీ పెడితే, ఆయన తన పార్టీ అజెండాలో ఏ అంశాలు పెడతారని ప్రశ్నించారు. ఆయన దగ్గర్నుంచి నాయకులంతా ఒక్కొక్కరే జారిపోతున్నారన్నారు.
విభజన బిల్లు లోకసభలో ఆమెదం పొందడంపై తమ అసంతృప్తిని రాజ్యసభలో వెల్లడిస్తామని చెప్పారు. సీమాంధ్రుల అభిప్రాయాలను హైకమాండ్ పరిగణనలోకి తీసుకోలేదని భావిస్తున్నామన్నట్లు చెప్పారు. పోలవరం ముంపు ప్రాంతాలను, భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపాలని డిమాండ్ చేస్తామని చెప్పారు.

హైదరాబాదుపై గవర్నర్కు అధికారాలు కట్టబెడతామని, హైదరాబాదుకు విషయంలో మరింత క్లారిటీ కావాలన్నారు. జరిగిన వ్యవహారంలో ఒక కాంగ్రెస్ పార్టీనే తప్పుపట్టడం తగదని అన్ని పార్టీల భాగస్వామ్యం ఇందులో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేలా చేపట్టే చర్యలను తాను అంగీకరించనన్నారు.
కాంగ్రెస్ పార్టీని వదిలి పోవడమంటే, పాలు తాగి రొమ్ము గుద్దడమే అని స్పష్టం చేశారు. ఒక రకంగా విభజనకు సిఎం కూడా కారణమని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని కిరణ్ చెప్పేవారని, ఆయన మాటను తామంతా నమ్మామని కానీ, బిల్లును ఆపడానికి ఆయన చేసిన ప్రయత్నాలేమీ లేవన్నారు. ఇప్పుడు రాజీనామా చేసి తప్పుకోవాలని భావిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications