కిరణ్ రెడ్డి కరెక్ట్: విభజనపై చిరు, జాతి ధ్వంసం: బాబు
న్యూఢిల్లీ/ శ్రీకాకుళం: గతంలో మూడు రాష్ట్రాలను విభజించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. విభజన రాజ్యాంగం ప్రకారం చేస్తే.. విభజన తీర్మానాన్ని, బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపాలని ఆయన కోరారు. విభజన ప్రక్రియలో కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తోందన్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.
విభజనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరి వరకు పోరాడుతామని అన్నారు. సీమాంధ్రుల ఆకాంక్షలను పట్టించుకోకుండా విభజనపై ముందుకెళ్లడం హర్షనీయం కాదని ఆయన చెప్పారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని రైతులకు, ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని ఆయన అన్నారు. త్వరలోనే వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని చిరంజీవి తెలిపారు.
తెలుగుజాతి విధ్వంసం: కేంద్రంపై బాబు మండిపాటు
స్వప్రయోజనాల కోసమే కాంగ్రెస్ విభజనకు పూనుకుందని, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు కలిసి తెలుగుజాతిని విధ్వంసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో అనధికారిక పొత్తులు కుదుర్చుకున్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని నిట్టనిలువుగా చీల్చిందని అన్నారు.
రాష్ట్ర విభజనతో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని చంద్రబాబు ఆరోపించారు. కేంద్ర నిర్ణయం ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం చూకూర్చేలా ఉండాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ను తెలుగు ప్రజల ముందు దోషిగా నిలబెడతానని, వారిచే చీకొట్టిస్తానని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముంపు ప్రాంతాల వాసుల్ని ఆయన శనివారం పరామర్శించారు.
శ్రీకాకుళం జిల్లాలో ముంపు కారణంగా పలు ప్రాంతాల వాసులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి, ప్రజలకు సాధ్యమైన మేర సాయం చేయాలనే ఉద్దేశంతోనే జిల్లాల పర్యటనలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.