బస్సెక్కనున్న చిరంజీవి: జగన్, చంద్రబాబు టార్గెట్
హైదరాబాద్: సీమాంధ్రలో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఆంధ్రప్రదేశ్ పిసిసి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ నివాసంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి, ఆనం రామనారాయణ రెడ్డి సమావేశమై ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రచార కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యం చేసుకోనున్నట్లు చిరంజీవి మాటలను బట్టి అర్థమవుతోంది. సమావేశానంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పర్యటిస్తామని, కార్యకర్తలతో సమావేశమవుతామని ఆయన చెప్పారు.
ఈ నెల 21వ తేదీన శ్రీకాకుళం, విజయనగరంలో పర్యటిస్తామని, 22వ తేదీన విశాఖపట్నం జిల్లాలో తిరుగుతామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనకు కారుకులు ఎవరనే విషయాన్ని ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీని కాపాడుకుంటామని ఆయన చెప్పారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని వైయస్ జగన్ సూచించారని, రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు లేఖలు ఇచ్చారని, ఈ విషయాలను ప్రజలకు చెబుతామని చిరంజీవి అన్నారు.