ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8: బాబుకు చిక్కు, ఆనాడే చిరంజీవి చెప్పారా!?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి చిరంజీవి.. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని తాను చెప్పినప్పుడే చేస్తే ఇప్పుడు డిమాండ్ సమస్య వచ్చేది కాదు కదా అని ఆయన అభిప్రాయపడుతున్నారు.
దాదాపు మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాలలో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు బాగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో హైదరాబాదులో సెక్షన్ 8 అంశం కూడా చర్చకు వచ్చింది. హైదరాబాదులో సెక్షన్ 8 పెట్టాలని ఏపీ మంత్రులు, టిడిపి డిమాండ్ చేసింది.
ఈ విషయమై గవర్నర్ నరసింహన్ను కూడా టిడిపి నేతలు నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాదులో తమకు భద్రత లేకుండా పోయిందని, సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని చెప్పారు.
అయితే, ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు కొత్తగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని టిఆర్ఎస్, రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నేతలు, వైయస్సార్ కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఆరోపించాయి.
ఇటీవల చిరంజీవి టీవీ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఓటుకు నోటు, సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై స్పందించారు. అదే సమయంలో హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, తాను చెప్పినప్పుడే చేస్తే బాగుంటేదని, ఇప్పుడు డిమాండ్ చేసే పరిస్థితి రాకపోయేదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కాంగ్రెస్ నేతలు చివరి వరకు విభజనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, విభజన అనివార్యమని తేలిన సమయంలో నాడు కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు. అందుకోసం గట్టిగా ప్రయత్నించారు కూడా. కానీ అది నెరవేరలేదు. కాగా, ఓటుకు నోటు కేసును చిరంజీవి తప్పుపడుతున్నారు.