ఆ దేశంతో భూభాగం మార్చుకోబోతున్న భారత్..! సంచలన నిర్ణయం దిశగా కేంద్రం..!
ఉపఖండంలో కీలక దేశంగా ఉన్న భారత్ (India)కు సరిహద్దుల్లో ఉన్న దేశాలతో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తున్న వాటిలో చాలా మటుకు ముందుకు సాగడం లేదు. అలాంటి ఓ సమస్యకు తాజాగా చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఈ మేరకు మణిపూర్ సరిహద్దుల్లో మయన్మార్ (Myanmar)తో ఉన్న ఓ వివాదాస్పద భూభాగ సమస్యను పరిష్కరించేందుకు వీలుగా ఇరు దేశాలూ భూభాగాలు మార్చుకోబోతున్నాయి.
దశాబ్దాలుగా సరిహద్దులు గుర్తించని భారత్-మయన్మార్ ఉమ్మడి సరిహద్దులోని ఒక భాగాన్ని పరిష్కరించుకోవడానికి ఇరుదేశాలూ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయి. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. సరిహద్దులో ఇంకా పరిష్కరించబడని కొన్ని ప్రాంతాలు ఉన్నాయని, వాటిపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. సరిహద్దులోని అపరిష్కృత ప్రాంతాలను పరిష్కరించుకోవడానికి చర్చలు జరుగుతున్నాయని ఆయన అంగీకరించారు. దీనిపై ఇప్పటికే అమెరికాకు చెందిన 'ది డిప్లొమాట్' పత్రిక కథనం ప్రచురించింది. అయితే ఈ ప్రతిపాదనను మణిపూర్ వ్యతిరేకిస్తోంది.

జూలై 17న ఒక అధికారిక పత్రాన్ని ఉటంకిస్తూ ప్రచురించిన కథనంలో.. మయన్మార్తో మణిపూర్ సరిహద్దు వెంబడి ఉన్న 65, 68 సరిహద్దు స్తంభాల మధ్య భాగాన్ని పూర్తి చేయడానికి సుమారు 1.4 చదరపు మైళ్ల భూభాగాన్ని మార్పిడి చేసుకునే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని ఆ పత్రిక పేర్కొంది. ఈ రెండు స్తంభాల మధ్య దూరం 2.8 కిలోమీటర్లు. మయన్మార్లోని సగైంగ్ ప్రాంతంలో ఉన్న కబావ్ లోయను ఆనుకుని, మణిపూర్లోని చందేల్ జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ సరిహద్దుల నిర్ధారణ ప్రక్రియ ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఇరుదేశాల మధ్య మొత్తం 1643 కి.మీల సరిహద్దు ఉంది. ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాంల గుండా ఇది ప్రయాణించి.. మయన్మార్లోని సగైంగ్ ప్రాంతం, చిన్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఇవన్నీ పర్వతాలు, అడవులతో కూడి ఉంది. ఇందులో అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ సెక్టార్, మణిపూర్లోని కబావ్ లోయలో దాదాపు 171 కిలోమీటర్ల మేర సమస్య పరిష్కారం కాకుండా ఉంది. దీని పరిష్కారం కోసమే ఇప్పుడు భారత్-మయన్మార్ భూభాగాలు మార్చుకునే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications