చిత్తూరు జిల్లా కలెక్టర్ షాకింగ్ నిర్ణయం.. ఆ 5 మండలాల ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఎందుకంటే..?
చిత్తూరు: జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫీవర్ సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదు మండలాల ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెదమండ్యం, తవణంపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె మండలాల్లోని రెవెన్యూ, పంచాయతీరాజ్, హెల్త్, సచివాలయం, మున్సిపల్ శాఖ ఉద్యోగుల నెల జీతాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆరో విడత ఫీవర్ సర్వేలో ఆయా మండలాల్లో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపైనా ఇదే చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జితాలు నిలిపివేయాలని జిల్లా ట్రెజరీకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏపీలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
రుయా ఆస్పత్రి ఘటనపై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 11 మంది కరోనా రోగులు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. మే 10న ఆక్సిజన్ సరైన సమయంలో అందకపోవడం వల్ల 11 మంది రోగులు మృతి చెందినట్లు జేస్తడి సుధాకర్ అనే వ్యక్తి, 30 మంది చనిపోయారంటూ మాజీ ఎంపీ చింతా మోహన్ ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు నిజమైతే తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని ఎన్ హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.