చిత్తూరు:లేడీ డాక్టర్ సూసైడ్...ఆత్మహత్యకు కారణాలపై భిన్నాభిప్రాయాలు
చిత్తూరు:చిత్తూరు జిల్లాలో యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. పీలేరు ఎస్వీ మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శిల్ప ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే యువ వైద్యురాలు శిల్ప సూసైడ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం విడుదలైన పీజీ ఫలితాల్లో శిల్ప ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. అయితే గతంలో మెడికల్ కళాశాల అధ్యాపకులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని రాష్ట్ర గవర్నర్కు శిల్ప ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉండటంతో ఈమె ఆత్మహత్య కారణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శిల్ప గవర్నర్కు ఫిర్యాదు చేసిందనే కక్షతో మెడికల్ కళాశాల అధ్యాపకులు కావాలని శిల్పను ఫెయిల్ చేశారని శిల్ప బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు శిల్ప 5 సంవత్సరాల క్రితం డాక్టర్ రూపేష్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. శిల్ప తండ్రి బ్యాంకు అధికారి కాగా, ఆమె సోదరి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అని తెలిసింది.
అయితే వారిద్దరూ ఉద్యోగాల రీత్యా వేరే రాష్ట్రాల్లో ఉండటంతో కుటుంబ సభ్యులు ఇంకా ఘటనా స్థలానికి చేరుకోలేక పోయారు. దీంతో శిల్ప సూసైడ్ విషయమై కుటుంబ సభ్యులు ఎవరూ ఫిర్యాదు చేయక పోవడంతో ఇంకా విచారణ మొదలు కాలేదు. అయితే యువ వైద్యురాలు శిల్ప కేవలం పరీక్ష తప్పానన్న కారణంగా ఆత్మహత్య చేసుకుందా?...లేక కళాశాలలో వేధింపులే కారణమా?...లేక కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిందా? ...అనే విషయం తేలాల్సి ఉంది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు అందడంతోనే విచారణ ప్రారంభించి ఆమె ఆత్మహత్య వెనుక కారణాలను పోలీసులు వెలికితీసేందుకు ఉద్యుక్తులవుతున్నారు. కుటుంబ సభ్యు ఇచ్చే సమాచారం ప్రకారం శిల్ప ఆత్మహత్య వెనుక కారణాలు తెలుసుకోవడం సులభం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.