కుప్పంలో జోరుగా పోలింగ్: ఓటు వేసిన వైసీపీ ఇన్ఛార్జ్ భరత్: బారులు తీరిన ఓటర్లు
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. 24 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీకి పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో వేర్వేరు కారణాలతో మిగిలిపోయిన 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కోసం పోలింగ్ కొనసాగుతోన్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం కుప్పంపైనే నిలిచింది.

మిగిలిన మున్సిపాలిటీలకూ..
ఇక్కడ విజయం సాధించడానికి తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెండింగ్లో ఉన్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, దర్శి, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అలాగే- ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో 12 డివిజన్లకు పోలింగ్ కొనసాగుతోంది.

1,206 మంది అభ్యర్థుల భవితవ్యం..
మొత్తం 353 వార్డులకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 28 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తంగా 325 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మొత్తంగా 1,206 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 8.62 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు నియోగించుకోనున్నారు. 908 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో 398 కేంద్రాలను సమస్యాత్మకంగా, 262 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు.

24 వార్డుల కుప్పం మున్సిపాలిటీ..
కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డుల కోసం పోలింగ్ కొనసాగుతోంది. 600 మంది పోలీసులను మోహరింపజేశారు. మొత్తం 48 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 57 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 230 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బుధవారం ఓట్ల లెక్కింపు ఉంటుంది. కుప్పంతో పాటు అన్ని మున్సిపాలిటీలకు నిర్వహిస్తోన్న పోలింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కింపును అదే రోజు చేపడతారు.

భారీ బందోబస్తు..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు బలగాలను మోహరింపజేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ స్వయంగా అక్కడి పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్నారు. అవాంఛనీయ సంఘటనలు జోటు చేసుకోకుండా.. వెబ్ క్యాస్టింగ్, సీసీటీవీల ద్వారా పోలింగ్ ప్రక్రియను రికార్డు చేస్తోన్నారు. అన్ని వార్డులను కూడా సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు.

ఓటు వేసిన భరత్..
ఈ మున్సిపాలిటీ పరిధిలో 57 వేల మంది ఓటర్లు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వారి కోసం మొత్తం 48 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. 230 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా- కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేఎస్జే భరత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 20వ వార్డులోని ఓటర్ల కోసం జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
Recommended Video

కుప్పానికి చంద్రబాబు..
కాగా- చంద్రబాబు నాయుడు ఇవ్వాళ కుప్పంలో పర్యటించనున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పానికి చేరుకుంటారు. పోలింగ్ను సరళిని స్వయంగా పర్యవేక్షిస్తారు. పోలింగ్ సరళి.. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉందంటూ వార్తలు అందుతున్నందు వల్లే చంద్రబాబుు అక్కడికి వెళ్లాల్సి వచ్చిందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.












Click it and Unblock the Notifications