అశోక్ బాబుకు బెయిల్ - విడుదల : రాజకీయ దురుద్దేశం - ఉద్యోగ సంఘాల నేతలున్నారంటూ..!!
టీడీపీ ఎమ్మెల్సీ ...ఏపీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకు బెయిల్ మంజూరు అయింది. వాణిజ్యపన్నుల శాఖలో పనిచేస్తున్నప్పుడు పదోన్నతి కోసం తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసారు. గురువారం అర్ద్రరాత్రి అరెస్ట్ చేసి...గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన పైన నమోదై సెక్షన్ల ఆధారంగా విచారించారు. అశోక్ బాబును 17 గంటలపాటు గుంటూరు సీఐడీ కార్యాలయంలోనే ఉంచారు. అక్కడే కొవిడ్ పరీక్ష నిర్వహించారు.
గుంటూరు నుంచి విజయవాడకు తరలింపు
ర్యాపిడ్ పరీక్షలో అశోక్బాబుకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. సాయంత్రం అశోక్బాబును విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం శుక్రవారం రాత్రి విజయవాడలోని సీఐడీ ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మొదట బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేసిన అధికారులు.. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా 467 సెక్షన్ పెట్టారని అశోక్బాబు తరఫు న్యాయవాదులు వాదించారు.
రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అరెస్ట్ చేశారని అన్నారు. ఇటీవలే అశోక్బాబు గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారని.. అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అశోక్బాబుపై నమోదు చేసిన కేసులో పేర్కొన్న సెక్షనన్నీ బెయిల్కు అర్హమైనవేనని ఆయన తరపున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
బెయిల్ మంజూరు..విడుదల
బెయిల్ మంజూరు చేయకుండా రిమాండ్ విధించాలని సీఐడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చైతన్య కోరారు. ఉద్యోగంలో ఉండగా పదోన్నతి కోసం తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. 467 సెక్షన్ పెట్టినందున రిమాండ్కు పంపాలని విన్నవించారు. ఇరువైపు వాదనలు విన్న సీఐడీ న్యాయమూర్తి.. అర్ధరాత్రి అశోక్బాబుకు బెయిల్ మంజూరు చేశారు. కోర్టు ఆదేశం మేరకు రూ. 20 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించి అశోక్బాబు విడుదలయ్యారు.రాజకీయ దురుద్దేశంతోనే తనను అరెస్ట్ చేశారని.. దీనివెనక పీఆర్సీ సాధన సమితిలోని కొందరు నేతలున్నారని అశోక్బాబు ఆరోపించారు.
హైకోర్టులో పిటీషన్.. వాయిదా
అంతకు ముందు అశోక్బాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అశోక్బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అశోక్బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు తీవ్రంగా ఖండించారు. ఎపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. సర్వీస్ మేటర్స్లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ ఆందోళన
అర్థ రాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏమోచ్చిందని నిలదీశారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్షగట్టిందని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లిం చుకుంటుందని హెచ్చరించారు. అశోక్ బాబును విచారించిన గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు టీడీపీ నేతలు చేరుకొని ఆందోళనకు ప్రయత్నించారు. దీంతో.. పలువరు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకొని అక్కడ నుంచి తరలించారు.